కాంగ్రెస్కు పూర్వవైభవం
ABN , First Publish Date - 2021-02-05T07:09:51+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. గురువారం విశాఖపట్నం జిల్లా అరకులోయలో విలేఖర్లతో మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగే చట్టాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవేనన్నారు.
పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్
అరకులోయ, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తుందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. గురువారం విశాఖపట్నం జిల్లా అరకులోయలో విలేఖర్లతో మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగే చట్టాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవేనన్నారు. నేటి ప్రభుత్వాలతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని, ప్రస్తుత పాలనే ఇందుకు నిదర్శనమన్నారు. బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేసినట్టే చేసి మరో జీవోను తెరపైకి తెచ్చారని, కాంగ్రెస్ పార్టీ గిరిజనం పక్షాన పోరాడుతుందన్నారు. జీవో-3ని అమలుకు వీలుగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేయలేదని, గిరిజనం అంతా ఈ జీవోను కొనసాగించాలని కోరుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. ఎన్నికలు వద్దంటూ మాత్రం కోర్టుకు జగన్ ప్రభుత్వం వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వ పాలన చూశారని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన నేటి జగన్ ప్రభుత్వ పాలన చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం, రాష్ట్రంలో ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయనే భావనకు ప్రజలు వస్తున్నారన్నారు. అనంతరం శైలజానాథ్ అరకు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో పీసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అరకు ఇన్చార్జి పి.శాంతకుమారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.