సచివాలయాలను సందర్శించిన పీవో, సబ్కలెక్టర్
ABN , First Publish Date - 2021-07-30T05:14:20+05:30 IST
మండలంలోని పలు గ్రామ సచివాలయాలను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ, సబ్కలెక్టర్ వి.అభిషేక్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు.
సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశం
పాడేరు, జూలై 29: మండలంలోని పలు గ్రామ సచివాలయాలను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ, సబ్కలెక్టర్ వి.అభిషేక్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పీవో గోపాలకృష్ణ మండలంలో లగిశపల్లి, పాడేరు- 1 సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. అలాగే సచివాలయం ద్వారా ప్రజలకు సేవలు పక్కాగా అందాలని, సమస్య పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. అలాగే సిబ్బంది ఎక్కడికి వెళ్లినా మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. సచివాలయాల పరిధిలో పారిశుధ్య, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే స్థానిక సబ్కలెక్టర్ వి.అభిషేక్ పాడేరులోని 2, 3 సచివాలయాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రికార్డులను తనిఖీ చేశారు. వలంటీర్లు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని గుర్తించి వారికి అబ్సెంట్ మార్క్ చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. వలంటీర్లు విధిగా హాజరు వేసుకోవాలని, ఎక్కడికైనా వెళితే మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కలిగేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సబ్కలెక్టర్ సూచించారు. సచివాలయ కార్యదర్శులు పనితీరు మెరుగుపర్చుకోవాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.