ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి
ABN , First Publish Date - 2021-11-28T06:23:33+05:30 IST
ప్రజారోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి దోమలవ్యాప్తిని అరికట్టి, యానాద్రి కాలువ మీదుగా ఫ్యాగింగ్ చర్యలు చేపట్టాలని చైర్పర్సన్ రమాకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

ప్రత్యేక సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ రమాకుమారి
ఎలమంచిలి, నవంబరు 27: ప్రజారోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి దోమలవ్యాప్తిని అరికట్టి, యానాద్రి కాలువ మీదుగా ఫ్యాగింగ్ చర్యలు చేపట్టాలని చైర్పర్సన్ రమాకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు చైర్పర్సన్ తులసీనగర్లో సమస్యలపై స్థానిక సచివాలయ సిబ్బందితో చర్చించి సలహాలిచ్చారు. కౌన్సిల్ సమావేశంలో 8 అంశాలతో కూడిన అజెండాను కార్యాలయ అధికారి సభ్యులందరికీ చదివి వినిపించారు. మునిసిపాలిటీలో దోమల వ్యాప్తికి ఫ్యాగింగ్ యంత్రాలు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. గాంధీనగర్ వార్డులో ఫోన్ సిగ్నలింగ్ చానల్ నిర్మాణానికి సంబంధించి కౌన్సిలర్ సమావేశానికి రాకపోవడంతో ఫోన్ ద్వారా అభిప్రాయం తీసుకున్నారు. ఉలక్పేట, తులసీనగర్ సమీపంలో తాగునీటి పైపులైన్ నిర్మాణం, ట్రేడ్ లైసెన్సు ఫీజుల నిర్ధారణ, సోమలింగపాలెం, పెదపల్లి వార్డులో నిర్మితమవుతున్న అర్బన్ క్లినిక్లకు సుమారు రూ.18 లక్షలతో ఎలక్ట్రిఫికేషన్, రంగులు వేసే పనులు చేపట్టేందుకు తీర్మానించారు. పలు చోట్ల సీసీ కల్వర్టుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను కౌన్సిల్ ముందుంచారు. ఈ సమావేశంలో కమిషనర్ క్రిష్ణవేణి, వైస్చైర్మన్ బెజవాడ నాగేశ్వరావు, కౌన్సిలర్లు సత్తిబాబు, దూది నరసింహమూర్తి, రమణ, మరిడేశ్వరరావు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.