వైద్య ఉద్యోగులపై ఐటీడీఏ పీవో చర్యలు
ABN , First Publish Date - 2021-08-25T05:11:25+05:30 IST
మండలంలో లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు గైర్హాజరైన ఇద్దరు ఉద్యోగులపై పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ షోకాజు నోటీసులు జారీచేసి, ఒక రోజు వేతనం కోత విధించారు.
విధులకు గైర్హాజరైన లోతుగెడ్డ పీహెచ్సీ ఎల్డీసీ, హెల్త్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
హెల్త్ ఎడ్యుకేటర్ డిప్యూటేషన్ రద్దు
గ్రామ సచివాలయాల్లో తనిఖీలు
చింతపల్లి సీహెచ్సీ సందర్శన
చింతపల్లి, ఆగస్టు 24: మండలంలో లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు గైర్హాజరైన ఇద్దరు ఉద్యోగులపై పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ షోకాజు నోటీసులు జారీచేసి, ఒక రోజు వేతనం కోత విధించారు. ఆయన మంగళవారం మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత లోతుగెడ్డ గ్రామ సచివాలయం, పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పీహెచ్సీలో ఉద్యోగుల హాజరును పరిశీలించి, ఎల్డీసీ ఎ.విజయ్కుమార్, హెల్త్ అసిస్టెంట్ ఆర్వీ ప్రసాద్ విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. వీరికి షోకాజు నోటీసు జారీచేశారు. హెల్డ్ ఎడ్యుకేటర్ రవికుమార్ మైదాన ప్రాంతంలో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నట్టు నమోదు చేసి ఉండడంతో పీవో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా ఇక్కడే విధులు నిర్వహించాలన్నారు. హెల్త్ ఎడ్యుకేటర్ డిప్యూటేషన్ రద్దుచేస్తున్నామని, తక్షణమే పీహెచ్సీకి వచ్చి విధుల్లో చేరాలని ఆదేశించారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. తరువాత చౌడుపల్లి, అంతర్ల, చిన్నగెడ్డ గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. గ్రామ సచివాలయం భవన నిర్మాణాలను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని టీడబ్ల్యూ డీఈఈ చాణక్యరావుని ఆదేశించారు.
చింతపల్లి సీహెచ్సీని సందర్శించిన గోపాలక్రిష్ణ... వార్డులు, రికార్డులు, ఓపీ, ల్యాబ్ని పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎన్సీయూ వైద్యాధికారి డీకే హిమబిందుకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదని చెప్పడంతో వెంటనే మంజూరుచేస్తామని పీవో చెప్పారు. ఎస్ఎన్సీయూ మరమ్మతులకు నిధులు మంజూరుచేస్తామని, రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో లాలం సీతయ్య, వైద్యాధికారులు రఘురామ్, రామ్నాయక్ తదితరులు వున్నారు.
కొక్కిరాపల్లి ఆశ్రమ పాఠశాల సందర్శన
పాడేరు: జి.మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును పరిశీలించారు. మొత్తం 386 మందికిగాను 40 మంది మాత్రమే వుండడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. వర్షాల కారణంగా విద్యార్థులు గ్రామాల నుంచి రాలేదని సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. నాడు-నేడు రెండో దశ కింద ఈపాఠశాలను అభివృద్థి చేస్తారని, హెచ్ఎం, ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.