మండుటెండలో ఉపాధి పనులు

ABN , First Publish Date - 2021-03-24T05:37:19+05:30 IST

వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. పది రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ చుర్రుమంటున్నది.

మండుటెండలో ఉపాధి పనులు
లచ్చన్నపాలెంలో మండుటెండలో మట్టి పనులు పనిచేస్తున్న ఉపాధి కూలీలు

నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించని అధికారులు

తాగునీరు, టెంట్‌, మెడికల్‌ కిట్లు సమకూర్చని వైనం

ఇబ్బంది పడుతున్న కూలీలు



మాకవరపాలెం, మార్చి 23: వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. పది రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ చుర్రుమంటున్నది. 10 గంటల తరువాత ఎండలో పనిచేసే వారు... ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కూలీలు ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలకు పనిచేసే ప్రదేశంలో తాగునీరు, నీడ సదుపాయంతోపాటు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో వుంచాలి. కానీ మండలంలో ఎక్కడా ఈ నిబంధనలు అమలవుతున్న దాఖలాలులేవు. కూలీలు ఇంటి వద్ద నుంచే తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఎండ వేడితో కొద్దిసేపటికే నీరు వేడెక్కిపోతున్నది. టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చెట్లు లేనిచోట్ల ఎండలోనే భోజనాలు చేయాల్సి వస్తున్నది. కూలీలు వడదెబ్బకు గురైతే తక్షణ ఉపశమన చర్యలు చేపట్టడానికి కనీసం ఎలక్ర్టాల్‌ ప్యాకెట్లు కూడా లేవు. పనులు చేస్తున్నప్పుడు గాయాలకు గురైతే ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్‌ కిట్లు లేవు.  అధికారులు స్పందించి పనిచేసే ప్రదేశంలో కనీస సదుపాయాలు కల్పించాలని ఉపాధి హామీ పథకం కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2021-03-24T05:37:19+05:30 IST