విశాఖ : ఆరుగురి హత్యలో కొత్త కోణం...!
ABN , First Publish Date - 2021-04-15T17:16:33+05:30 IST
విశాఖపట్నం : జిల్లాలోని పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగురు అనుమానాస్పద స్థితిలో
విశాఖపట్నం : జిల్లాలోని పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో గంటకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. మొదట అనుమానాస్పదంగా భావించగా.. ఆ తర్వాత ఆస్తి వివాదమే కారణమని తెలిసింది. అయితే తాజాగా ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణ హత్యలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న అప్పలరాజు కుమార్తె- విజయ్కు మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని తెలుస్తోంది. 2018లో జరిగిన ఈ ప్రేమ వ్యవహారం కారణంగా కక్ష పెంచుకున్న అప్పలరాజు అర్ధరాత్రి ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు సమాచారం. అప్పలరాజు కుమార్తెతో.. విజయ్ ఫోన్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన తండ్రి..ఆ యువకుడిపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్ను అప్పట్లో అరెస్టు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినప్పటికీ విజయ్పై, అతని కుటుంబంపై పగ పెంచుకున్న అప్పలరాజు బుధవారం అర్ధరాత్రి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అన్నీ అనుమానాలే..!
అయితే.. ఆస్తి కోసం జరిగిన వివాదంలో అప్పలరాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడనీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మృతుల బంధవులు సైతం ఈ హత్యలు ఆస్తి కోసమే జరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం ఘర్షణలు జరుగుతున్నాయని బంధువులు చెబుతున్నారు. హంతకుడు అప్పలరాజును తమ ముందుకు తెచ్చేవరకూ మృతదేహాలను ఇక్కడ నుంచి కదలనివ్వమని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అప్పలరాజును రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. విచారణ పూర్తయితే అసలేం జరిగింది..? అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.