నేత్ర పర్వంగా సింహాచలేశుడి కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2021-10-30T05:03:51+05:30 IST
పచ్చటి తోరణాలు, భక్తుల హరినామ స్మరణల నడుమ సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి నిత్యకల్యాణం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉదయం 9.30గంటలకు ఆలయ కల్యాణమండపంలో నిత్యకల్యాణాన్ని నిర్వహిస్తారు.

సింహాచలం, అక్టోబరు 29: పచ్చటి తోరణాలు, భక్తుల హరినామ స్మరణల నడుమ సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి నిత్యకల్యాణం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉదయం 9.30గంటలకు ఆలయ కల్యాణమండపంలో నిత్యకల్యాణాన్ని నిర్వహిస్తారు. దానిలో భాగంగా శుక్రవారం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని భూదేవి, నీలాదేవి సమేతంగా రజిత వేదికపై ఉంచారు. దేవాలయ అర్చకులు పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పించి ఆగమ శాస్త్ర విధానంలో కల్యాణాన్ని వేడుకగా జరిపారు. మంగళాశాసనం, మంత్రపుష్పాల సమర్పణ తర్వాత వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
అప్పన్నను దర్శించుకున్న అధికారులు
వరాహలక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం పలువురు అధికారులు దర్శించుకున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్ డైరెక్టర్ సంజీవ్కుమార్, జాయింట్ డైరెక్టర్ దినేష్శర్మ, విపిన్ కుమార్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏపీ ఆర్ఓ ఆర్కే సింగ్, ప్రాజెక్టు డైరెక్టర్ పి.శివశంకర్, అలోక్ పాండే, తదితరులు ఉన్నారు. వారికి ఈఓ సూర్యకళ ఆహ్వానం పలకగా, కప్పస్తంభ ఆలింగనం, బేడామండప ప్రదక్షిణ అనంతరం వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు.