ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయండి
ABN , First Publish Date - 2021-09-18T05:55:03+05:30 IST
డివిజన్ పరిధిలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని నర్సీపట్నం ఆర్డీవో ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు.
నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు
రావికమతం, సెప్టెంబరు 17: డివిజన్ పరిధిలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని నర్సీపట్నం ఆర్డీవో ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన గదులు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లెక్కింపు మొత్తం వీడియో తీయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తకుండా జనరేటర్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. పాస్ లేనిదే లెక్కింపు కేంద్రంలోకి ఎవరినీ అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్ఐ జోగారావుకు సూచించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యలయంలో ఓట్ల లెక్కింపు అధికారులతో జరిగిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి పి.రాజగోపాల్, తహసీల్దార్ కనకారావు, ఎంపీడీవోఓ రామచంద్రమూర్తి, ఇంజనీరింగ్ అధికారి సుమతి పాల్గొన్నారు.