నేటి నుంచి నర్సీపట్నంలో లాక్డౌన్
ABN , First Publish Date - 2021-05-17T04:46:59+05:30 IST
మునిసిపాలిటీలో సోమవారం నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుంది.
ఉదయం 10 గంటల వరకే కిరాణా, కూరగాయల దుకాణాలు
మధ్యాహ్నం 12 వరకు ఆర్టీసీ బస్సులు రాకపోకలు
నర్సీపట్నం, మే 16 : మునిసిపాలిటీలో సోమవారం నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుంది. ఇటీవల చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వ్యాపారులు తమ దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కూరగాయలు, పాలు, కిరాణా షాపులు ఉదయం 10గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయి. ఆ తర్వాత మెడికల్ షాపులు మినహా.. అన్నీ మూత పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలు చేసుకొని తర్వాత దుకాణాలను మూస్తున్నారు. ఇప్పుడు వ్యాపారులే స్వచ్ఛందంగా వారం రోజుల పాటు షాపులు బంద్ చేయాలని తీర్మానం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 12గంటల వరకు తిరుగుతాయని డిపో మేనేజర్ పవన్కుమార్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధిస్తున్న లాక్డౌన్కు నర్సీపట్నం ప్రజలు పూర్తి సహకారం అందించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మునిసిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.