‘వపాకు వందనం’ పుస్తకం ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-09-19T04:46:24+05:30 IST
చిత్రకళా పరిషత్ వపా-బాపు ఆర్ట్ అకాడమీ, 64 కళలు.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో సుంకర చలపతిరావు సంపాదకత్వంలో కళాసాగర్ యల్లపు రాసిన ‘వపాకు వందనం’ పేరుతో రూపొందించిన వడ్డాది పాపయ్య శత జయంతి ప్రత్యేక సంచికను శనివారం పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు.
వడ్డాది పాపయ్య శతజయంతి సందర్భంగా ప్రత్యేక సంచిక
హాజరైన అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ
విశాఖపట్నం, సెప్టెంబరు 18: చిత్రకళా పరిషత్ వపా-బాపు ఆర్ట్స్ అకాడమీ, 64 కళలు.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో సుంకర చలపతిరావు సంపాదకత్వంలో కళాసాగర్ యల్లపు రాసిన ‘వపాకు వందనం’ పుస్తకాన్ని శనివారం పౌరగ్రంథాలయంలో ఆవిష్కరించారు. వడ్డాది పాపయ్య శత జయంతి సందర్భంగా రూపొందించిన ఈ ప్రత్యేక సంచికను అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జానపద రీతుల్లో చిత్ర రచన ప్రారంభించి సంప్రదాయ, ఆధునిక విధానాలతో పాటు తన సొంత బాణీల్లో చిత్ర రచన కొనసాగించిన వ్యక్తి వడ్డాది పాపయ్య అన్నారు. అద్భుత వర్ణచిత్రాలు రూపొందించడమేకాక, చిత్రం నీడలు ఆయన రూపొందించేలా ఎవరికీ సాధ్యమయ్యేది కాదన్నారు. ఆయన చిత్రా లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని,ఇందుకోసం నగరంలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని అభిప్రాయ పడ్డారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర కళాప్రదర్శనను ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం అధిపతి శిష్ల్టాశ్రీనివాస్ ప్రారంభించారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు అల్లురాంబాబు ప్రత్యేక సంచికను సమీక్షించారు. చిత్ర కళా పరిషత్ అధ్యక్షుడు జి.కె.విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వడ్డాది శిష్యుడు ఇప్పిలి జోగి సన్యాసిరావును సత్కరించారు. పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.