నిరుద్యోగులను నట్టేట ముంచిన జగన్రెడ్డి
ABN , First Publish Date - 2021-12-30T06:11:09+05:30 IST
సీఎం జగన్మోహన్రెడ్డి జాబ్ క్యాలెండర్ను అటకెక్కించి నిరుద్యోగులను నట్టేట ముంచారని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.
![నిరుద్యోగులను నట్టేట ముంచిన జగన్రెడ్డి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123012394782/12302021004024n92.jpg)
అటకెక్కిన జాబ్ క్యాలెండర్
టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద
అనకాపల్లి, డిసెంబరు 29: సీఎం జగన్మోహన్రెడ్డి జాబ్ క్యాలెండర్ను అటకెక్కించి నిరుద్యోగులను నట్టేట ముంచారని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీ కోసం ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఈ పోస్టులకు ప్రతి నెలా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఆచరణ లేదన్నారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం జూలై నుంచి డిసెంబర్ వరకు 7,867 పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో చూపలేకపోయారని విమర్శించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల వరకు మరో 2,736 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉందని, 1238 ఎస్సీ, ఎస్టీ, బ్యాలాగ్ పోస్టులతో పాటు వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. గ్రూపు-1, 2 పోస్టులకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు బోడి వెంకట్రావు, కోట్ని రామకృష్ణ, కుప్పిలి జగన్, ఒమ్మి సత్యనారాయణ, మళ్ల గణేశ్ పాల్గొన్నారు.