బొర్రాలో రంగురాళ్ల వేట
ABN , First Publish Date - 2021-07-12T05:46:24+05:30 IST
మండలంలోని బొర్రా గుహలు రైల్వే స్టేషన్ పరిధిలో రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయినా రైల్వే పోలీసులు పట్టించుకోవడం లేదు.
![బొర్రాలో రంగురాళ్ల వేట](https://media.andhrajyothy.com/appimg/galleries/1921071212150651/07122021001524n76.jpg)
రైల్వేస్టేషన్కు కూతవేటు దూరంలో తవ్వకాలు
రాత్రి వేళల్లో గిరిజనులతో సేకరణ
చోద్యం చూస్తున్న రైల్వే పోలీసులు
అనంతగిరి, జూలై 11: మండలంలోని బొర్రా గుహలు రైల్వే స్టేషన్ పరిధిలో రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయినా రైల్వే పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమార్కుల రంగురాళ్ల వేట నిరంతరం కొనసాగుతున్నది. బొర్రా రైల్వే స్టేషన్ను కూతవేటు దూరంలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గం వద్ద చింతచెట్టు, రైల్వే సిబ్బంది నివాస గృహాలను ఆనుకొని తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం. సాయంత్రం, రాత్రివేళల్లో తవ్వకాలు చేపడుతూ సేకరించిన మట్టిని బస్తాలలో సిద్ధం చేసుకొని గోస్తనీ నదిలో కడిగి రంగురాళ్లను సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది రంగురాళ్ల వ్యాపారులు గిరిజన కూలీలతో తవ్వకాలు చేపడుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక అవస్థలు పడుతున్న వారిని గుర్తించి వారికి పచ్చనోట్లు ఎరచూపి తవ్వకాలకు ప్రేరేపిస్తూ గడిచిన రెండు నెలలుగా ఈప్రాంతంలో గుట్టుగా తవ్వకాలు చేపడుతున్నట్టు స్థానికులు తెలిపారు. అయితే సంబంధిత రైల్వే పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పలు ఆరోపణలకు తావిస్తున్నది. స్థానికంగా తవ్వకాలపై నిఘా పెరుగుతున్నట్టు గమనించిన తవ్వకందారులు గోతులను రాళ్లతో, ముళ్ల కంపలతో మూసివేశారు. ఇప్పటికైనా రైల్వే పోలీసులు స్పందించి అక్రమ రంగురాళ్ల క్వారీలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.