హౌసింగ్ వన్టైమ్ సెటిల్మెంట్ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-12-07T05:40:44+05:30 IST
పేదలను దోచుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హౌసింగ్ వన్టైమ్ సెటిల్మెంట్ను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్మే గిడ్డి ఈశ్వరి
పాడేరు, డిసెంబరు 6: పేదలను దోచుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హౌసింగ్ వన్టైమ్ సెటిల్మెంట్ను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పేరిట రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ప్రభుత్వం అక్రమంగా వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పట్టణ వీధుల్లో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా అంబేడ్కర్ కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. పేదలకు గూడు కల్పించాలనే ఆశయంతో గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం డబ్బులు గుంజాలని చూడడం దారుణమన్నారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న ఇంటికి తాజా హక్కు కల్పిస్తామని ప్రజల్ని మభ్య పెట్టి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం ఘోరమన్నారు. పేదలకు భారంగా మారిన ఓటీఎస్ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలెవరూ ఓటీఎస్కు డబ్బులు చెల్లించవద్దని, టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఓటీఎస్ను కల్పిస్తుందన్నారు. ఈసందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, టీడీపీ సీనియర్ నేతలు మత్స్యరాస వరహాలరాజు, చల్లంగి లక్ష్మణరావు, చల్లంగి జ్ఞానేశ్వరి, సోమెలి చిట్టిబాబు, రొబ్బి రాము, జి.శాంతికుమారి, టీడీపీ నేతలు గంగపూజారి శివకుమార్, బుద్ధ జ్యోతికిరణ్, రమేశ్నాయుడు, చిరంజీవి, సుబ్బలక్ష్మి, కుమారి, కల్యాణం, బాబూరావు, కొండబాబు, తదితరులు పాల్గొన్నారు.