గలీజు!
ABN , First Publish Date - 2021-12-30T06:01:08+05:30 IST
జిల్లాలో దేవదాయ శాఖ అధికారుల తీరు చాలా విచిత్రంగా ఉంటోంది. అయిన వారికైతే ఒకలా...కానివారికైతే మరొకలా నిబంధనలు అమలు చేస్తున్నారు. దేవదాయ భూములు/దుకాణాలు/కల్యాణ మండపాలను ఎవరికైనా లీజుకు ఇవ్వాలంటే... వేలం వేయాలి. ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారికి కేటాయించాలి. ఇది కూడా ఏడాది కాలానికే. ఆ తరువాత మళ్లీ వేలం నిర్వహించాలి. నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తం పెంచడానికి అద్దెకు ఉండేవారు అంగీకరిస్తే...

అడ్డగోలుగా దేవదాయ వ్యవహారం
విశాఖ డెయిరీకి దీర్ఘకాలిక లీజు నిమిత్తం పరదేశమ్మ ఆలయ భూమి
వేలం లేకుండా కట్టబెట్టేందుకు అధికారుల యత్నం
రెండు నెలల క్రితం కుదరదని సమాధానం
ఇప్పుడు ఫైల్ పట్టుకొని అమరావతికి పయనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో దేవదాయ శాఖ అధికారుల తీరు చాలా విచిత్రంగా ఉంటోంది. అయిన వారికైతే ఒకలా...కానివారికైతే మరొకలా నిబంధనలు అమలు చేస్తున్నారు. దేవదాయ భూములు/దుకాణాలు/కల్యాణ మండపాలను ఎవరికైనా లీజుకు ఇవ్వాలంటే... వేలం వేయాలి. ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారికి కేటాయించాలి. ఇది కూడా ఏడాది కాలానికే. ఆ తరువాత మళ్లీ వేలం నిర్వహించాలి. నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తం పెంచడానికి అద్దెకు ఉండేవారు అంగీకరిస్తే...
వారికే మరో ఏడాది ఇవ్వవచ్చు. అంతే తప్ప దీర్ఘకాలిక లీజులు ఇవ్వడానికి లేదు. నిబంధనలు అంగీకరించవు. ఇలా ప్రేమ సమాజానికి చెందిన భూములను దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నారనే కారణంతోనే సాయిప్రియా రిసార్ట్ నుంచి 30 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించారంటూ అధికార పార్టీ పెద్దలు దేవదాయ శాఖ అధికారులను నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పు డు అదే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లిలో సిద్ధిలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన దుకాణాలను లీజుకు ఇవ్వడానికి ఈఓ వేలం తేదీ ప్రకటిస్తే, దానిని ఆపించేసి మరీ వేలం లేకుండా పాత వారికే మళ్లీ దుకాణాలు దక్కేలా అమరావతి వెళ్లి ఫైల్పై సంతకాలు పెట్టించారు. ఇప్పుడు లంకెలపాలెంలో విశాఖ డెయిరీ ఆధీనంలో వున్న ఐదు కోట్ల రూపాయల విలువైన ఎకరా స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడానికి ఫైలు పట్టుకొని మళ్లీ అమరావతి వెళ్లారు.
దశాబ్దం క్రితమే ఆక్రమణ
పరదేశమ్మ ఆలయానికి లంకెలపాలెం సర్వే నంబర్ 189లో 10.13 ఎకరాల భూమి ఉంది. విలువైన ఆ భూమిని కొందరు ఆక్రమించారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో సబ్ డివిజన్లు చేయించి కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు. పలువురు పరిశ్రమలు పెట్టుకున్నారు. ఆలస్యంగా మేల్కొన్న దేవదాయ శాఖ ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టించింది. ఆక్రమణదారులు లీజు కట్టాలని సూచించింది. ఇందులో ఎకరా భూమిని ఆడారి తులసీరావు కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు దశాబ్దం క్రితమే ఆక్రమించి అందులో ‘రాయల్ లైన్ ఐస్క్రీమ్’ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. ఇటీవల దేవదాయ శాఖ అధికారులు దానిని ఆక్రమణగా గుర్తించి లీజు కట్టమంటే అది కూడా చెల్లిస్తున్నారు. అయితే నష్టాల్లో వున్న ఆ ఐస్క్రీమ్ ఫ్యాక్టరీని ఇటీవల విశాఖ డెయిరీ టేకోవర్ చేసింది. దాంతో యాజమాన్య హక్కులపై చర్చ జరిగింది. ఏడాదికొకసారి ఇలా లీజు కట్టలేమని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని దేవదాయ శాఖ అధికారులకు విన్నవించారు. అలా కుదరదని సమాధానం రావడంతో రాజకీయ ఒత్తిళ్లు పెట్టారు. లంకెలపాలెంలో అమ్మవారి భూమి దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలంటే, విశాఖలో మరో అమ్మవారి ఆలయ పునర్మిర్మాణానికి సహకరించాలని, ఆ ఖర్చు అంతా భరించాలని అధికా రులు కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దీనికి డెయిరీ ప్రతినిధులు
అంగీకరించడంతో ఆగమేఘాల మీద ఫైల్ తయారుచేశారు. రెండు నెలల క్రితమే (అక్టోబరు 26న) నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు దీర్ఘకాలిక లీజుకు సిద్ధం కావడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలం లేకుండా, సరైన ధర నిర్ణయించకుండా, ప్రభుత్వానికి నష్టం వచ్చేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫైల్ అమరావతికి పంపించాం
- కె.శాంతి, అసిస్టెంట్ కమిషనర్, దేవదాయ శాఖ
లంకెలపాలెంలో ఎకరా భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని విశాఖ డెయిరీ ప్రతినిధులు కోరారు. మూడేళ్ల నుంచి పదకొండేళ్ల వరకు లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. ఫైల్ తయారుచేసి పంపించాము. 33 ఏళ్లకు ఇస్తేనే దీర్ఘకాలిక లీజు అవుతుంది. 11 ఏళ్లు దీర్ఘకాలం కిందకు రాదు.