తన భర్త, గిరిజనులను విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-07-24T05:51:12+05:30 IST
పోలీసులు అదుపులో ఉన్న తన భర్త ముర్ల రామారావు, పెబ్బెంపల్లి గిరిజనులను విడుదల చేయాలని అమ్మవారి ధారకొండ సర్పంచ్ ముర్ల సత్యవతి విజ్ఞప్తి చేశారు.

ఏఎస్పీ తుషార్ డుడీని కలిసిన ఎ. ధారకొండ సర్పంచ్ సత్యవతి
చింతపల్లి, జూలై 23: పోలీసులు అదుపులో ఉన్న తన భర్త ముర్ల రామారావు, పెబ్బెంపల్లి గిరిజనులను విడుదల చేయాలని అమ్మవారి ధారకొండ సర్పంచ్ ముర్ల సత్యవతి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా నాయకులు బోనంగి చిన్నయ్య పడాల్, పాంగి ధనుంజయితో కలిసి బాధిత కుటుంబసభ్యులు రోహిత, కావ్య, బాలమ్మ, గిరిజనులు స్థానిక ఏఎస్పీ తుషార్ డుడిని కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్, బాధిత కుటుంబ సభ్యులు స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ బుధవారం పెబ్బెంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయన్నారు. దీంతో విచారణ పేరిట సర్పంచ్ భర్త ముర్ల రామారావు, గిరిజనులు ముర్ల లక్ష్మయ్య, కోరాబు వెంకట రావు, కొర్ర మత్స్యరాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇప్పటి వరకు వారిని విడిచిపెట్టలేదన్నారు. తమ కుటుంబ సభ్యులకు, మావోలకు ఎటువంటి సంబంధం లేదని, తక్షణమే విడిచిపెట్టాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.