జీవో 3 రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
ABN , First Publish Date - 2021-07-23T04:42:54+05:30 IST
గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని గిరిజన సంఘం, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
గిరిజన ఉద్యోగుల సంఘం డిమాండ్
విశాఖపట్నం, జూలై 22: గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని గిరిజన సంఘం, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. జీవో నంబరు 3 ద్వారా ఆదివాసీలు గడచిన ముప్పై ఏళ్ల నుంచి నూరు శాతం రిజర్వేషన్ పొందుతున్నారని, అటువంటి జీవోను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని, దాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో నంబరు 3 రిజర్వేషన్లపై తాము జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరిస్తూ టీఏసీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స, బౌండ తౌడన్న, కె.సత్యనారాయణ, కె.శోభన్కుమార్, కరుణాకర్, అప్పలనర్సింహం, దామోదర్ తదితరులు పాల్గొన్నారు