మాస్క్‌ లేకుంటే జరిమానా, క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2021-04-13T06:06:10+05:30 IST

కొవిడ్‌- 19 సెకండ్‌వేవ్‌ తీవ్రంగా వున్న నేపథ్యంలో మాస్క్‌ లేకుండా బయటకు వచ్చే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయనున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా హెచ్చరించారు.

మాస్క్‌ లేకుంటే జరిమానా, క్రిమినల్‌ కేసు
సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌- 19 సెకండ్‌వేవ్‌ తీవ్రంగా వున్న నేపథ్యంలో మాస్క్‌ లేకుండా బయటకు వచ్చే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయనున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా హెచ్చరించారు. కమిషనరేట్‌లో ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ కొవిడ్‌ వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ను వాడడం అవసరమన్నారు. అయితే చాలామంది వీటిపై స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మాస్క్‌ లేని వాహన చోదకులకు గత నెల 27 నుంచి రూ.120 చొప్పున ఈ-చలాన్‌ జారీచేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 54,661 మందికి జరిమానాలు విధించామన్నారు. దీనివల్ల 95 శాతం మంది ఇప్పుడు మాస్క్‌ లేకుండా బయటకు అడుగుపెట్టడం లేదన్నారు. అలాగే పాదచారులు, బీచ్‌కు వచ్చే సందర్శకులు, హోటళ్లు, పార్కులు, మార్కెట్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్‌లు ధరించకపోతే ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నామని, ఇకపై జీవీఎంసీతో కలిసి జరిమానాలు విధిస్తామన్నారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కొవిడ్‌-19 నిబంధనల ఉల్లంఘన సెక్షన్‌ 188 కింద క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో క్రైమ్‌ డీసీపీ సురేష్‌బాబు, ఏడీసీపీ వేణుగోపాల్‌నాయుడు, ఏసీపీ శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:06:10+05:30 IST