వాల్తేరు క్లబ్పై కన్ను?
ABN , First Publish Date - 2021-01-06T06:23:27+05:30 IST
విశాఖపట్నం నగర నడిబొడ్డున వున్న వాల్తేరు క్లబ్ భూములపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మంగళవారం విచారణ చేపట్టింది.
- ఆ భూములపై క్లబ్ యాజమాన్యానికి హక్కు లేదంటూ సిట్కు ఫిర్యాదు
- వెంటనే విచారణ చేపట్టిన అధికారులు
- ఏడాది క్రితం ఫిర్యాదుల స్వీకరణకు ఫుల్స్టాప్ పెట్టిన బృందం
- రేపో మాపో నివేదిక సమర్పించనున్నట్టు రెండు వారాల క్రితం ప్రకటన
- ఇప్పుడు మళ్లీ ఫిర్యాదు వచ్చిందని విచారణ చేపట్టటడంపై అనుమానాలు
- స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం నగర నడిబొడ్డున వున్న వాల్తేరు క్లబ్ భూములపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మంగళవారం విచారణ చేపట్టింది. ఆ భూములపై క్లబ్కు హక్కు లేదని, వారు లీజుకు మాత్రమే తీసుకున్నారని, ఆ గడువు ముగిసిపోయినా ఇంకా కొనసాగుతున్నారని, అవన్నీ ప్రభుత్వ భూములని అందిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టినట్టు ప్రకటించింది. ఇటు క్లబ్ యాజమాన్యానికి నోటీసు జారీచేసి, ఆధారాలు, పత్రాలతో రావాలని ఆదేశించింది. మరోవైపు కలెక్టర్ వినయ్చంద్ను క్లబ్ భూములపై నివేదిక కోరింది. అయితే క్లబ్ తరఫున న్యాయవాది, మరో ప్రతినిధి మాత్రమే సిట్ ముందు హాజరయ్యారు. పత్రాలు సమర్పించేందుకు తమకు కొంత గడువు కావాలని కోరారు. అయితే...వారి అభ్యర్థనపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని సిట్ చైర్మన్ విజయకుమార్ విలేఖరులకు తెలిపారు. కలెక్టర్ నుంచి నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. ఆపైనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ఈ వివరాలు కూడా తమ నివేదికలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. నివేదిక మొత్తం తయారైందని, ఈ నెల 15, 16 తేదీల్లో సమర్పించేందుకు సన్నద్ధంగా ఉన్నామని వివరించారు.
ఇదీ వాల్తేరు క్లబ్ చరిత్ర
వాల్తేరు క్లబ్ నగర నడిబొడ్డున సిరిపురంలో ఉంది. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన క్లబ్ ఇది. నగరంలోని ప్రముఖులంతా ఇందులో సభ్యులే. టౌన్ సర్వే నంబరు 1012, 1016, 1018, 1021లలో 31 ఎకరాలను పేర్ల కుటుంబం నుంచి 1895లో లీజుకు తీసుకొని క్లబ్ను ప్రారంభించారు. ఈ భూములకు అనకాపల్లి సెటిల్మెంట్ అధికారి 1961లో రఫ్ పట్టాను జారీచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ నాటి విశాఖ అర్బన్ తహసీల్దార్ సెటిల్మెంట్ కోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ అనకాపల్లి అధికారి జారీచేసిన పట్టాను నిర్ధారిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దానిపై సర్వే అండ్ సెటిల్మెంట్ రాష్ట్ర కమిషనర్ కోర్టులో సవాల్ చేశారు. 1990లో అక్కడ అనకాపల్లి అఽధికారి ఇచ్చిన పట్టా ఉత్తర్వులు రద్దు చేశారు. ఎస్టేట్ ఎబాలిషన్ యాక్టు కింద పిటిషన్ వేసుకోవాలని క్లబ్కు సూచించారు. అయితే క్లబ్ పిటిషన్ వేయలేదు. దాంతో ఆ భూములపై క్లబ్కు హక్కులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు లీజును రద్దు చేసి ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని 2013లో నాటి కలెక్టర్ నోటీసులు జారీచేశారు. దీనిపై క్లబ్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని కొనసాగుతోంది.
మొదట్లో వైసీపీ కీలక నేత కన్ను
వాల్తేరు క్లబ్పై తొలుత వైసీసీకి చెందిన ఓ కీలక నేత కన్నేశారు. అధికారంలోకి రాగానే విశాఖలో విలువైన భూములపై ఆరా తీశారు. అందులో వాల్తేరు క్లబ్ కూడా వుందని తెలిసి, వారిని పిలిచి మాట్లాడారు. దారికి రాకపోవడంతో లీగల్గా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆరు నెలల క్రితం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో అడ్వకేట్ జనరల్ను, మరికొందరు న్యాయ అధికారులను విశాఖపట్నం తీసుకువచ్చి ప్రభుత్వ అతిథి గృహంలో వాల్తేరు క్లబ్ భూములపై చర్చించారు. అదేరోజు వాటికి సంబంధించిన కీలకమైన రికార్డులను అదే ప్రత్యేక విమానంలో అమరావతి తీసుకుపోయారు.
రిపోర్టు సమర్పిస్తున్న సమయంలో సిట్ విచారణ?
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు నియామకమైన సిట్ నవంబరు, 2019తో ఫిర్యాదుల స్వీకరణకు ఫుల్స్టాప్ పెట్టింది. నివేదిక తయారుచేసి అందించాలనుకునే సమయానికి కరోనా రావడంతో వాయిదా పడింది. ఇప్పుడు నివేదిక ఇవ్వనున్న సమయంలో ఇప్పుడు వాల్తేరు క్లబ్పై ఫిర్యాదు వచ్చిందని చెబుతూ, మంగళవారం విచారణకు పిలిచింది. దీనిపై కూడా నివేదిక సమర్పిస్తామని సిట్ సభ్యులైన అనురాధ, చైర్మన్ విజయకుమార్ తెలిపారు. వాల్తేరు క్లబ్ వివాదాన్ని సిట్ పరిధిలోకి తేవడానికి కొందరితో ఫిర్యాదు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్లబ్ ప్రతినిధులు మధ్యవర్తి ద్వారా వైసీపీ నేతతో రాజీకి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని, అందుకే సిట్తో విచారణ చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.