ఏయూ గ్రంథాలయంలో తాళపత్రాల డిజిటలైజేషన్
ABN , First Publish Date - 2021-12-28T06:05:22+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా గ్రంథాలయంలో తాళపత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను సోమవారం వీసీ వీపీజీడీ ప్రసాదరెడ్డి ప్రారంభించారు.
![ఏయూ గ్రంథాలయంలో తాళపత్రాల డిజిటలైజేషన్](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122812334148/12282021003506n52.jpg)
ప్రక్రియను ప్రారంభించిన వీసీ ప్రసాదరెడ్డి
ఏయూ క్యాంపస్, డిసెంబరు 27: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా గ్రంథాలయంలో తాళపత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను సోమవారం వీసీ వీపీజీడీ ప్రసాదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ భాషల్లో రచించిన తాళపత్రాలను ఏయూలో దశాబ్దాలుగా భద్రపరచడం జరుగుతోందన్నారు. వీటిని డిజిటలైజేషన్ చేసి భవిష్యత్తు తరాలకు ఉపయుక్తంగా శాశ్వతంగా ఉంచే ప్రక్రియను ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో వీటిని ఏయూ వెబ్సైట్లో పొందపరుస్తామన్నారు. గ్రంథాలయాధికారి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏయూలో ఐదు భాషల్లో వున్న 2,663 తాళపత్రాలను ఏడాదిలోగా డిజిటలైజేషన్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
పరిశ్రమల అనుసంధానంతో పనిచేస్తాం
పరిశ్రమల అనుసంధానంతో పనిచేస్తూ యువతకు మార్గనిర్దేశం చేస్తామని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. సోమవారం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో ఆయన రాంకీ ఫార్మాసిటీ ఎండీ డాక్టర్ పి.లాల్కృష్ణతో సమావేశమయ్యారు. ఫార్మా టెస్టింగ్ ల్యాబ్లో నెలకొల్పే సాంకేతిక పరికరాలు, మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం లాల్కృష్ణ ఏయూ అధికారులతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న లేబొరేటరీల భవన నిర్మాణ ప్రగతిని పరిశీలించారు.