పోలవరం కాలువ భూ సేకరణకు సహకరించండి
ABN , First Publish Date - 2021-12-01T04:18:44+05:30 IST
బాబూ జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని తహసీల్దార్ రమాదేవి కోరారు.
తహసీల్దార్ రమాదేవి
సబ్బవరం, నవంబరు 30 : బాబూ జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని తహసీల్దార్ రమాదేవి కోరారు. మండలంలోని నల్లరేగులపాలెం శివారు ద్వారకా నగర్లో భూ సేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ భూదేవి చెరువు వద్ద నిర్మించనున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సబ్బవరం మండలంలో సుమారు 20 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయని తెలిపారు. నల్లరేగులపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి, జిరాయితీ కలిపి 167.81 ఎకరాలు సేకరించనున్నామన్నారు. గ్రామానికి వచ్చే సర్వే అధికారులకు రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పెతకంశెట్టి లక్ష్మి, ఎంపీటీసీ రాపేటి అరుణ, గ్రామ పెద్దలు రామకోటి అప్పారావు, రాపేటి రాము, వీఆర్వో నారీమణి, పలువురు రైతులు పాల్గొన్నారు.