నిర్మాణం పూర్తయినా ఇంకా ‘మరుగు’నే..
ABN , First Publish Date - 2021-05-03T04:29:27+05:30 IST
నిర్మాణం పూర్తయినా ఇంకా ‘మరుగు’నే..
![నిర్మాణం పూర్తయినా ఇంకా ‘మరుగు’నే..](https://media.andhrajyothy.com/appimg/galleries/1921050210573750/05022021225803n77.jpg)
ఇదీ సామాజిక మరుగుదొడ్ల పరిస్థితి
పరవాడ, మే 2: సింహాద్రి ఎన్టీపీసీ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.33 లక్షలతో పరవాడ, వాడచీపురుపల్లి గ్రామాల్లో సామాజిక మరుగుదొడ్లు (కమ్యూనిటీ టాయ్లెట్స్)ను నిర్మించారు. ఒక్కో మరుగుదొడ్డు నిర్మాణానికి రూ.16.50 లక్షలు వెచ్చించారు. నిర్మాణ పనులు పూర్తయి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. దీంతో స్థానికులు సింహాద్రి సీఎస్ఆర్ అధికారుల తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ దశాబ్దాల కాలంగా ఇక్కడ మరుగుదొడ్లు లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం పరిసర గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చే వారంతా అత్యవసర సమయంలో నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. దీంతో సమస్యను స్థానికులు ఎన్టీపీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించి మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పటికీ ప్రారంభించలేదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్లను త్వరితగతిన ప్రారంభించేలా సింహాద్రి అధికారులు చొరవ చూపాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.