విశాఖ ఉక్కు పరిరక్షణే అందరి ధ్యేయం కావాలి
ABN , First Publish Date - 2021-10-31T06:16:03+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణే అందరి ధ్యేయం కావాలని పర్యావరణ ఉద్యమకారిణి మేధా పాట్కర్ పిలుపునిచ్చారు.
![విశాఖ ఉక్కు పరిరక్షణే అందరి ధ్యేయం కావాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921103112440262/10312021004544n2.jpg)
మేధా పాట్కర్ పిలుపు
కూర్మన్నపాలెం (విశాఖపట్నం), అక్టోబరు 30: విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణే అందరి ధ్యేయం కావాలని పర్యావరణ ఉద్యమకారిణి మేధా పాట్కర్ పిలుపునిచ్చారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు, కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఆమె శనివారం ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణతో కలసి సందర్శించి, సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సుమారు రూ.మూడు లక్షల కోట్ల విలువైన ఉక్కు కర్మాగారాన్ని కారుచౌకగా తన కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ సంస్థ కూడా అభివృద్ధి చెందలేదన్నారు. మేడిన్ ఇన్ ఇండియా, మేకిన్ ఇన్ ఇండియా అంటూ ఇండియాను విక్రయించాలని చూస్తున్నారన్నారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, బ్యాంకులు నష్టాల బాటలో ఉన్నట్టు చూపుతున్నారన్నారు. కార్మిక, కర్షక ఐక్య పోరాటాలతోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవాలన్నారు. దేశ్ బచావో...దేశ్ బనావో అంటూ కార్మికులను ఉత్సాహ పరిచారు. డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ ఢిల్లీలో రైతు ఉద్యమాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న నిర్విరామ ఉద్యమానికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు. ప్రభుత్వ రంగాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి.ఆదినారాయణ, అయోధ్యరామ్, తదితరులు పాల్గొన్నారు.