అప్రకటిత విద్యుత్ కోతలతో అవస్థలు
ABN , First Publish Date - 2021-05-22T04:24:05+05:30 IST
అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.

అల్లాడిపోతున్న జనం
పట్టించుకోని అధికారులు
పరవాడ, మే 21: అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మండలంలో గత 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అసలే వేసవి.. ఆపై విద్యుత్ కోతలు తోడవడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరింత అవస్థలు పడాల్సి వస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా కరెంట్ కోతలు పెరగడంతో ప్రజలు విద్యుత్ శాఖ అధికారుల తీరు పట్ల మండిపడుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వేసవి కాలంలో కరెంట్ కోతలు విధిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలోనూ...
విద్యుత్ కష్టాలు మండల కేంద్రంలోనూ నెలకొన్నాయి. కాకపోతే మిగతా గ్రామాలతో పోలిస్తే కాస్త నయం. ఎప్పుడు కరెంటు ఉంటుందో... ఎప్పుడు నిలిచిపోతుందో చెప్పలేని పరిస్థితి మండలంలో నెలకొంది. కరెంట్ లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్ఈసీఎస్ అధికారులు తక్షణమే స్పందించి అప్రకటిత విద్యుత్ కోతలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో స్థానిక సబ్స్టేషన్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.