రా..రమ్మని వారు..రానే రామని వీరు!
ABN , First Publish Date - 2021-12-07T06:05:11+05:30 IST
మునిసిపాలిటీలో పనులంటేనే కాంట్రా క్టర్లు ముఖం చాటేస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు పనుల కోసం వీరంతా పోటీ పడేవారు. దక్కిన కాంట్రాక్టును ఉత్సాహంగా పూర్తిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. ఎందుకంటే చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులంటే.. అబ్బే తమ వల్ల కాదన్నట్టు వ్యవహరి స్తున్నారు.
![రా..రమ్మని వారు..రానే రామని వీరు!](https://media.andhrajyothy.com/appimg/galleries/1921120712333496/12072021003352n43.jpg)
మునిసిపాలిటీలో కాంట్రాక్టు పనులంటే మాకొద్దు బాబోయ్..అంటున్న కాంట్రాక్టర్లు
చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
కొత్త వాటి జోలికి వెళ్లేందుకు విముఖత
ఒక్కో పనికి రెండు మూడుసార్లు టెండర్లు ఆహ్వానం
స్పందన లేకపోవడంతో అధికారులు అవాక్కు
నర్సీపట్నం, డి సెంబరు 6 : మునిసిపాలిటీలో పనులంటేనే కాంట్రా క్టర్లు ముఖం చాటేస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు పనుల కోసం వీరంతా పోటీ పడేవారు. దక్కిన కాంట్రాక్టును ఉత్సాహంగా పూర్తిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. ఎందుకంటే చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులంటే.. అబ్బే తమ వల్ల కాదన్నట్టు వ్యవహరి స్తున్నారు. కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) ద్వారా బిల్లులు ఇస్తామంటే పనులు చేయమని, ముందుగా చెక్కు ఇస్తామంటేనే పనులు చేస్తామని అధికారులకు తెగేసి చెప్పేస్తున్నారు. దీంతో ఒక పనికి రెండు మూడుసార్లు టెండర్లు ఆహ్వా నించాల్సి వస్తోంది. 2020 అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో 38 అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పను లకు సంబంధించి కాంట్రాక్టర్లకు నాలుగు కోట్ల రూపాయల వరకు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని సమా చారం. వీటి కోసం మునిసిపల్ కార్యాల యం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందని వాపోతున్నారు. దీంతో కొత్త పనులు చేపట్టడానికి కాంట్రా క్టర్లు ముందుకు రావడం లేదు. అత్యవసరంగా చిన్నచిన్న పనులు నామిటేడ్ పద్ధ తి లో ఇస్తాం పనిచేసి పెట్టండని కోరు తున్నా.. ముందుగా చెక్కు ఇస్తేనే పనులు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఒక పనిని రిజిస్టర్డ్ కాంట్రాక్ట్ పేరుతో కాంట్రాక్ట్ టెండర్ వేసి.. ఇద్దరు ముగ్గురు సబ్ కాంటాక్టర్లతో చేపట్టే పరిస్థితి వచ్చింది. బిల్లులు సకాలంలో మంజూరు చేయకపోవడంతో సబ్ కాంటాక్టర్లు కూడా పనులు చేయడానికి సుముఖత చూపడం లేదు. ఏదైనా అత్యవసరమని పని చేయమని అంటే.. ముందు పెట్టుబడి పెట్టి పనిచేసుకోండి తర్వాత బిల్లులు మంజూరు చేస్తామని అధికారులు అంటున్నారని మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షం కౌన్సిలర్లే వాపోవడం విశేషం.
గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్మాణానికి మూడుసార్లు టెండర్లు!
మునిసిపల్ ఆఫీసును ఆనుకొని ఉన్న ఖాళీ స్థంలో రూ.47 లక్షలతో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్మాణానికి అధికారులు మూడుసార్లు టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. మరో మూడు రోడ్లు పనుల కోసం రూ.20 లక్షలతో టెండర్లు పిలిచినా ఉలుకు పలుకు లేదు. సకాలంలో బిల్లులు మంజూరవుతాయని నమ్మకం లేకనే పనులు చేయడానికి ముందుకు రావడంలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. దీంతో మునిసిపాలిటీలో అభివృద్ధి తిరోమనం దిశగా పయని స్తోందనే వాదన వినిపి స్తోంది.