లక్షకు చేరువ!
ABN , First Publish Date - 2021-05-11T04:54:37+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా రెండు వేలకుపైగా నమోదవుతుండగా, సోమవారం మాత్రం 1,618 వచ్చాయి.
జిల్లాలో మరో 1,618 కరోనా కేసులు
మొత్తం 99,949
చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతి
విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా రెండు వేలకుపైగా నమోదవుతుండగా, సోమవారం మాత్రం 1,618 వచ్చాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 99,949కు చేరింది. ఇందులో 79,490 (సోమవారం 991) మంది కోలుకున్నారు. ఇదిలావుంటే చికిత్స పొందుతూ మరో తొమ్మిది మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 707కు చేరింది. కేసులు తగ్గడం కొంత ఉపశమనం కలిగించే విషయమైనప్పటికీ...పరీక్షలు సంఖ్య తగ్గించడం వల్ల కేసులు తగ్గాయా?, లేక రోజువారీ మాదిరిగా పరీక్షలు నిర్వహించినప్పటికీ పాజిటివిటీ శాతం తగ్గిందా? అన్నది అధికారులు వెల్లడించలేదు. రోజువారీ మాదిరిగానే పరీక్షలు చేసినప్పటికీ...ఈ స్థాయిలో కేసులు తగ్గినట్టయితే ఊరట కలిగించే అంశంగానే భావించాలని వైద్యులు చెబుతున్నారు. అయితే...ఒకటి, రెండు రోజులు కేసులు తగ్గినంత మాత్రానా కరోనా తగ్గుముఖం పట్టినట్టు భావించలేమని, వరుసగా కొద్దిరోజులపాటు ఇదేవిధంగా తగ్గుతూ వస్తేనే వైరస్ వ్యాప్తి తగ్గినట్టు భావించాల్సి ఉంటుందంటున్నారు.