విద్యుదాఘాతంతో ఆటో డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-12-15T05:56:05+05:30 IST

విద్యుదాఘాతానికి గురైన ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మాధవధార ఆర్‌ఆర్‌ టవర్స్‌ సమీపంలో జరిగింది

విద్యుదాఘాతంతో ఆటో డ్రైవర్‌ మృతి
కుమ్మరి లోవరాజు (ఫైల్‌ ఫొటో)

తాటిచెట్లపాలెం, డిసెంబరు 14: విద్యుదాఘాతానికి గురైన ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మాధవధార ఆర్‌ఆర్‌ టవర్స్‌ సమీపంలో జరిగింది ఎయిర్‌పోర్ట్‌ పోలీసుల కథనం మేరకు.. మాధవధారకు చెందిన ఆటోడ్రైవర్‌ కుమ్మరి లోవరాజు (45) రోజంతా ఆటో నడుపుకుని రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన కేబుల్‌ వైర్‌ ఓ లారీకి తగిలి సమీపంలోని విద్యుత్‌ తీగలపై పడింది.  దానికి సపోర్ట్‌గా ఇనుప వైరు ఉండడం, అది ఆటో డోర్‌కు తాకడంతో లోవరాజు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. కేబుల్‌ వైరు తెగిపడిన విషయం గుర్తించిన లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తమై లారీ దిగి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. సీఐ ఉమాకాంత్‌, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేశారు. మృతుడు లోవరాజుకు భార్య మహాలక్ష్మి, ఇద్దరు కుమారులున్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


Updated Date - 2021-12-15T05:56:05+05:30 IST