ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య స్వల్ప పేచీ

ABN , First Publish Date - 2021-07-03T05:24:32+05:30 IST

ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య నెలకొన్న చిన్న వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. శుక్రవారం నక్కపల్లి మండలం కాగిత హైవే జంక్షన్‌ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ ఎంవీ రమణ తెలిపిన వివరాలివి.

ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య స్వల్ప పేచీ
ప్రమాదానికి కారణమైన నాగాలాండ్‌కు చెందిన లారీ


 చివరకు ఒకరు బలి 

అతని కుమారుడికి తీవ్ర గాయాలు

కాగిత హైవే జంక్షన్‌ వద్ద ఘటన

నక్కపల్లి, జూలై 2 : ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య నెలకొన్న చిన్న వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. శుక్రవారం నక్కపల్లి మండలం కాగిత హైవే జంక్షన్‌ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ ఎంవీ రమణ తెలిపిన వివరాలివి.  కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంగి గ్రామానికి చెందిన కూచిపూడి దుర్గారావు (42)కు సొంత లారీ ఉంది. శుక్రవారం ఉదయం తన లారీలో సరుకును విశాఖపట్నం రవాణా చేసేందుకు బయల్దేరాడు. తనతో పాటు దుర్గారావు కుమారుడు రాజేంద్ర పవన్‌ను కూడా తీసుకువచ్చాడు. ఈ లారీ పాయకరావుపేట జంక్షన్‌ దాటిన తరువాత నాగాలాండ్‌కు చెందిన మరో లారీ డ్రైవర్‌ అతివేగంగా వాహనాన్ని నడుపుతూ దుర్గారావు లారీ మిర్రర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ లారీని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆపలేదు. దీంతో దుర్గారావు లారీతో ముందుగా  వేంపాడు హైవే టోల్‌ప్లాజాకు చేరుకున్నాడు. ఈ లోగా అక్కడికి వచ్చిన నాగాలాండ్‌ లారీ డ్రైవర్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, అతడు ఆపలేదు. దీంతో తండ్రీకొడుకులిద్దరూ ఆ లారీ ముందుగా భాగన ఉన్న ఇనుప రాడ్‌ను పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ డ్రైవర్‌ ఆపకుండా లారీముందు వేలాడుతున్న తండ్రీకొడుకులతో కాగిత గ్రామం సమీపాన ఉన్న కల్వర్టును ఢీకొన్నాడు. దీంతో దుర్గారావు అక్కడికక్కడే మృతిచెందగా, అతని కుమారుడు పవన్‌  తీవ్ర గాయాలకు గురయ్యాడు. నాగాలాండ్‌ లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సీఐ నారాయణరావు, ఎస్‌ఐ రమణ సంఘటాన స్థలాన్ని పరిశీలించారు. పవన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-07-03T05:24:32+05:30 IST