కేంద్ర కారాగారం నుంచి 20 మంది ఖైదీలు విడుదల
ABN , First Publish Date - 2021-05-25T04:49:50+05:30 IST
కరోనా నేపథ్యంలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి గత మూడు రోజుల్లో దఫదఫాలుగా 20 మంది ఖైదీలను విడుదల చేసినట్టు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు.

ఆరిలోవ, మే 24: కరోనా నేపథ్యంలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి గత మూడు రోజుల్లో దఫదఫాలుగా 20 మంది ఖైదీలను విడుదల చేసినట్టు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి ఉధృతంగా వున్నందున కొంతమంది ఖైదీలను తాత్కాలిక బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడు సంవత్సరాల లోపు శిక్షపడిన 47 మంది ఖైదీల జాబితాను సిద్ధం చేసి న్యాయస్థానాలకు పంపినట్టు సూపరింటెండెంట్ వివరించారు. అందులో 20 మంది విడుదలకు న్యాయస్థానాలు అనుమతి ఇవ్వగా, మరో 27 మందికి సంబంధించి ఇంకా ఆదేశాలు రావలసి ఉందన్నారు.