నిరుపేదల స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్
ABN , First Publish Date - 2021-12-10T05:02:45+05:30 IST
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల ఇళ్ల స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలుగు దేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హామీ ఇచ్చారు.

టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి హామీ
ఏలూరు రూరల్, డిసెంబరు 9: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల ఇళ్ల స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలుగు దేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హామీ ఇచ్చారు. మండలంలోని శనివారపుపేటలో గురువారం టీడీపీ గౌరవ సభ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభు త్వం పేదల నుంచి రూ.ఐదు వేల కోట్లు రాబట్టుకునేందుకు తెరపైకి తెచ్చిన ఓటీఎస్ పథకానికి ఎవరూ డబ్బులు చెల్లించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడో ఎన్టిఆర్ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ళకు ఇప్పుసడు డబ్బులు కట్టించుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలను బెదిరించి భయ బ్రాంతులకు గురిచేసి పెన్షన్లు, బియ్యం కార్డులు రద్దు చేస్తామని వేధించడం సరికాదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలి ప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.