గుబ్బల మంగమ్మ ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-26T04:25:06+05:30 IST
గుబ్బల మంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.
బుట్టాయగూడెం, ఫిబ్రవరి 25 : గుబ్బల మంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. దీంతో అటవీ ప్రాంతమంతా అమ్మవారి నామస్మ రణతో మార్మోగిపోయింది. ఏజెన్సీ రూట్లన్నీ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తజన సందోహంతో నిండిపోయాయి. మూడు రోజుల పాటు శనివారం వరకు ఉత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాజ్యలక్ష్మి దంప తులు అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఏజెన్సీకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు కోర్స గంగరాజు, కోర్స కన్నపరాజు, పెద్దిరెడ్డి మూర్తి, యు.ఏసుబాబు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. రెండో రోజు శుక్రవారం అమ్మవారికి మహిళా భక్తులచే లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ ఆవరణలో కమిటీవారు నిర్మించిన 40 వేల లీటర్ల మంచినీటి ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు. మొదటి రోజునే అమ్మ దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.