ఈత సరదా ప్రాణం తీసే!
ABN , First Publish Date - 2021-01-27T06:54:56+05:30 IST
ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలంలోని బట్టుపల్లి సమీపంలోని పాలేరు వాగు వద్ద మంగళవారం జరిగింది.
పాలేరు వాగులోకు దిగి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
గణతంత్ర దినోత్సవం రోజు రెండు గ్రామాల్లో విషాదం
మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు
పీసీపల్లి, జనవరి 26: ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలంలోని బట్టుపల్లి సమీపంలోని పాలేరు వాగు వద్ద మంగళవారం జరిగింది. కనిగిరి మండలం ఏరువారిపల్లికి చెందిన మేకల గురవయ్య కుమారుడు కార్తీక్ (13) గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వాగుపల్లికి చెందిన ముప్పూరి రవీంద్ర కుమారుడు లక్ష్మీనారాయణ (14) కూడా అదే హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ మంగళవారం స్కూల్లో జరిగిన గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఈత సరదా తీర్చుకునేందుకు పాఠశాలలోని తోటి విద్యార్థులతో కలిసి బట్టుపల్లి సమీపంలోని పాలేరు వాగుకు వెళ్లారు. అందరూ వాగులోని మడుగులో ఈదుతుండగా కార్తీక్, లక్షీనారాయణలు లోతుకు వెళ్లారు. సరిగా ఈతరాని ఇద్దరూ మునిగిపోయారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి వారు గ్రామాలకు వెళ్లి విషయం తెలిపారు. సమాచారం అందుకున్న పీసీపల్లి ఎస్ఐ ప్రేమ్కుమార్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. స్వయంగా ఆయనే వాగులోకి దూకి మడుగు అడుగుభాగంలో ఉన్న వారిని గుర్తించి బయటకు తీశారు. అప్పటికే విద్యార్థులు మృతిచెంది ఉన్నారు. కనిగిరి సీఐ కె.వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను కనిగిరి వైద్యశాలకు తరలించారు. తల్లిదండ్రులు తమ బిడ్డల మృతదేహాలపై పడి రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.