తాగునీరందించండి
ABN , First Publish Date - 2021-07-25T05:24:18+05:30 IST
సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని సీతారాంపురం గ్రామస్థులు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లాఠ్కర్ వద్ద మొరపెట్టుకున్నారు. కలెక్టర్ ఆ గ్రామంలోని హాస్టల్లో శనివారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆయన మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యతో పాటు పలువురు వ్యక్తిగత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

సీతారాంపురం గ్రామస్థుల మొర
గ్రామంలో రాత్రి బస చేసిన కలెక్టర్ శ్రీకేష్ బీ లఠ్కర్
వంగర, జూలై 24: సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని సీతారాంపురం గ్రామస్థులు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ వద్ద మొరపెట్టుకున్నారు. కలెక్టర్ ఆ గ్రామంలోని హాస్టల్లో శనివారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆయన మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యతో పాటు పలువురు వ్యక్తిగత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో పార్టీ నెపంతో 13 పింఛన్లు తొలగించారని, న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదు చేశారు. సచివాలయ సిబ్బంది సకాలంలో రావడం లేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తక్షణం దర్యాప్తు చే యాలని ప్రత్యేకాధికారి జైప్రకాష్ని ఆదేశించారు. కొళాయిలు, బోర్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మహిళలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మడ్డువలస రిజర్వాయర్లో భూములు కోల్పో యి నిరాశ్రయులయ్యామని, పునరావాస ప్యాకేజీలో భాగంగా ఇంకా కొంత మొత్తం చెల్లించాల్సి ఉందని, తగు చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరారు. ఆధార్ కేంద్రం మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. ఫిర్యాదులు, సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం కూడా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కుమార్, తహసీల్దార్ ఐజాక్, ఎంపీడీవో త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.