యాత్రలకు ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2021-10-30T03:49:35+05:30 IST
యాత్రలకు ప్రత్యేక రైలు
- ఐఆర్సీటీసీ మేనేజర్ చంద్రమోహన్
ఆమదాలవలస, అక్టోబరు 29: యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నట్టు సౌత్ సెంట్రల్(విశాఖ)జోన్ మేనేజర్ బి.చంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) నవంబరులో ప్రత్యేక రైలును నడుపుతోంది. వ్యాపార ధృక్పథంతో కాకుండా ప్రజలు దేశంలోని పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో కూడా కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు నడిపాం. ఇదే క్రమంలో ఈ ఏడాది నవంబరు 28న ‘వైబ్రంట్ గుజరాత్’ పేరిట యాత్రికుల కోసం విజయవాడలో ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. డిసెంబరు 8వ తేదీ నాటికి తిరిగి చేరుకుంటుంది. 11 రోజుల ప్రయాణంలో సోమనాఽథ్, ద్వారక, నాగేశ్వరం, బెట్ ద్వారక, శబరి ఆశ్రమం, అక్షరఽథామ్తో పాటుగా సర్దార్ వల్లభాయ్ విగ్రహ సందర్శన ఉంటుంది. ప్రయాణికుల బాధ్యత అంతా సంస్థదే. ఉదయం అల్పాహారంతో పాటు రెండు పూటలా భోజనం, ఇతర సదుపాయాలు రైలులోనే ఏర్పాటు చేస్తాం. యాత్రకు వచ్చే ప్రయాణికులకు స్లీపర్ క్లాస్ అయితే ఒకరికి రూ.10,400, థర్డ్ ఏసీ ఒకరికి రూ.17,330 చెల్లించాలి. రాత్రి బస సమయంలో స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ధర్మశాలలో డార్మెటరీ, థర్డ్ ఏసీ ప్రయాణికులకు హోటల్స్లో గదులు కేటాయిస్తామ’ని చంద్రమోహన్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారంతా 8287932318, 8287932281 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ దాస్, స్టేషన్ మేనేజర్ మొదలవలస రవి తదితరులు పాల్గొన్నారు.