పెళ్లి వేడుకలకు 20 మందికే అనుమతి
ABN , First Publish Date - 2021-05-06T05:04:49+05:30 IST
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ అమలు చేస్తున్నామని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని స్పష్టం చేశారు. మండల అధికారులు, ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్ బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా వివాహ వేడుకలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

అన్ని దుకాణాలు 12గంటలకు మూసేయాల్సిందే
లేదంటే 144 సెక్షన్ కింద కేసులు
కలెక్టర్ నివాస్
కలెక్టరేట్, మే 5: కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ అమలు చేస్తున్నామని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని స్పష్టం చేశారు. మండల అధికారులు, ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్ బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా వివాహ వేడుకలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ‘పెళ్లికి హాజరయ్యే వారి పేర్లను సంబంధిత తహసీల్దారులకు సమర్పించాలి. వివాహం జరిగే ప్రదేశాన్ని వారు వచ్చి తనిఖీ చేస్తారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై 144 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, తదితర సంస్థలు పనిచేస్తాయి. ఆ తరువాత వాటిని మూసేయాల్సిందే. అత్యవసర సేవలు, పాలు వంటి ఆహార పదార్ధాలు మాత్రమే 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. రెండు వారాల పాటు ఇది అమలులో ఉంటుంది. ఎక్కడా నలుగురు కంటే ఎక్కువగా ఉండరాదు. 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.’ అని కలెక్టర్ తెలిపారు.
వీటికి మినహాయింపు..
వైద్య సేవలు, ఫ్రింట్ అండ్ ఎలకా్ట్రనిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్ కాస్టింగ్, ఐటీ సంస్థలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్లెట్లు, విద్యుత్ ఉత్పాదక, పంపిణీ, ట్రాన్స్మిషన్ రంగం, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగి సేవలు, ప్రైవేట్ సెక్యూరిటీ సేవలు, వస్తు తయారీ పరిశ్రమలు, వ్యవసాయ పనులు, పంటల సేకరణ, తదితర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లకు పార్సిళ్లకు మాత్రమే అనుమతి చేస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఆర్టీసీ బస్సులతో సహా ఆటోలు, టాక్సీలు కూడా నిలిపివేయాలన్నారు. అంతరాష్ట్ర రవాణా, జిల్లా లోపల, బయట కూడా వాహనాలు తిరగరాదని స్పష్టం చేశారు. దీనిపై సరిహద్దు మండలాల తహసీల్దారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి చోట కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెండు వారాల కర్ఫ్యూ తరువాత జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా శాయశక్తులా ప్రయత్నించాలని కలెక్టర్ తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో జేసీ కె.శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.