తెగ తాగేస్తున్నారు!
ABN , First Publish Date - 2021-01-12T06:02:04+05:30 IST
మందుబాబులు తెగ తాగేస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచి మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సంక్రాంతి సమీపిస్తుండడంతో రెట్టింపయ్యాయి. ప్రభుత్వం దుకాణాలు తగ్గించినట్టు చెబుతున్నా..విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. పండుగ రెండు రోజులు ఉందనగా వైన్ షాపులు, బార్లు మందుబాబులతో సందడిగా కనిపిస్తున్నాయి.

పెరిగిన మద్యం అమ్మకాలు
బాట్లింగ్ యూనిట్ నుంచి రోజుకు రూ.4 కోట్ల సరుకు తరలింపు
ఎచ్చెర్ల, జనవరి 11:
మందుబాబులు తెగ తాగేస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచి మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సంక్రాంతి సమీపిస్తుండడంతో రెట్టింపయ్యాయి. ప్రభుత్వం దుకాణాలు తగ్గించినట్టు చెబుతున్నా..విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. పండుగ రెండు రోజులు ఉందనగా వైన్ షాపులు, బార్లు మందుబాబులతో సందడిగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 158 మద్యం షాపులు, 17 బార్లు ఉన్నాయి. ఈ షాపులన్నింటికీ ఎచ్చెర్లలోని బేవరేజెస్ కార్పొరేషన్ బాట్లింగ్ యూనిట్ ద్వారానే మద్యం లిఫ్టింగ్ జరుగుతోంది. రోజుకు సుమారుగా రూ.4 కోట్ల మేరకు మద్యం ఇక్కడి నుంచి దుకాణాలకు తరలిస్తున్నట్టు బాట్లింగ్ యూనిట్ అధికారులు చెబుతున్నారు.. రోజుకు 7 నుంచి 8 వేల కేసులు ఐఎంఎల్, బీరు కేసులు షాపులకు తరలిస్తున్నారు. వైన్షాపులు తెరిచే వేళల్లో మార్పులు రావడంతో వ్యాపారం బాగా జరుగుతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. మారిన నిబంధనల ప్రకారం ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు వైన్షాపులు తెరిచే ఉంటాయి. 2020 డిసెంబరు వరకూ రోజుకు రూ.2 కోట్ల విలువ చేసే మద్యం లిఫ్టింగ్ చేసేవారు. ధరలు బాగా తగ్గడంతో పాటు కొన్నిరకాల పాత బ్రాండ్లు లభిస్తుండడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఎంహెచ్, రాయల్ చాలెంజ్, బ్లెండర్ స్రైడ్తో పాటు చీప్ లిక్కర్లో 9 సీ హార్స్, హైదరాబాద్ బ్లూ తదితర బ్రాండులు ఎక్కువగా అమ్ముడవుతున్నట్టు తెలుస్తోంది. 14న సంక్రాంతి రోజున మాత్రమే బాట్లింగ్ డిపోకు సెలవు కాగా, 15న ఐచ్చిక సెలవుగా ప్రకటించినట్టు మేనేజర్ ఏసుదాసు తెలిపారు.