ఉత్తరాంధ్రపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2021-10-29T04:39:44+05:30 IST
ఉత్తరాంధ్రపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంవీఎస్ శర్మ
- మహాసభలు ప్రారంభం
గుజరాతీపేట, అక్టోబరు 28 : ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంవీఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కల్యాణ మండపంలో సీపీఎం 17వ మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిఽథిగా ఎంవీఎస్ శర్మ మాట్లాడారు. పాలకవర్గాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. జగన్, చంద్రబాబులకు అధికారం గోల తప్ప, ప్రజల కష్టాలు పట్టడం లేదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తుంటే ఇక్కడి నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పరిశ్రమలు, రోడ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడామైదానాలు, పార్కులు, అడవులను మానిటైజేషన్ పేరుతో ప్రైవేటు పరం చేయడం క్షమించరానిదన్నారు. వ్యవసాయ నల్లచట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చలి, ఎండ, కరోనాను తట్టుకొని పోరాడుతున్నారని తెలిపారు. దేశంలో ఐదున్నర కోట్ల టన్నుల ఆహారనిల్వలు ఉన్నా ప్రజలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చౌదరి తేజేశ్వరరావు రచించిన చౌదరి తేజేశ్వరరావు జ్ఞాపకాలు-అనుభవాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.