క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , First Publish Date - 2021-10-25T05:40:32+05:30 IST
ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

గుజరాతీపేట: ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీకళాశాల మైదానంలో కొన్నచిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. దేశం క్రీడల్లో వెనుకబడిందని.. నిధులలేమి కారణంగా ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్రీడల పరిస్థితి కొంతమెరుగుపడుతోందని అన్నారు. క్రీడలతో క్రమశిక్షణ ఏర్పడి తద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో అథ్లెటిక్స్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అథ్లెటిక్స్ సీనియర్ క్రీడాకారుడు గౌరునాయుడును సన్మానించారు. సాయంత్రం జరిగిన కార్యక్ర మంలో విజేతలకు జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయతో కలసి బహుమతులు అందజేశారు. ఆటలో గెలుపోటములు సహజమని.. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని జడ్పీ చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పూడి బాలాదిత్య, కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మునిసిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి, కొన్న వెంకటేశ్వరరావు, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.