రాజాంలో అగ్నికీలలు
ABN , First Publish Date - 2021-04-11T05:49:30+05:30 IST
రాజాం మునిసిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డులో శనివారం రాత్రి అగ్నికీలలు చెలరేగాయి. గార్రాజు చీపురుపల్లి పంచాయతీ పరిధిలోని ఐదు ఎకరాల్లో డంపింగ్ యార్డ్ విస్తరించి ఉంది. ఈ యార్డులో శనివారం రాత్రి 8 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. రాజాం మునిసిపాలిటీకి చెందిన రెండు వాటర్ ట్యాంకర్లతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా , అదుపులోకి రాలేదు.
- డంపింగ్యార్డులో చెలరేగిన మంటలు
- జీడి, మామిడి తోటలకు తీవ్ర నష్టం
రాజాం రూరల్, ఏప్రిల్ 10: రాజాం మునిసిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డులో శనివారం రాత్రి అగ్నికీలలు చెలరేగాయి. గార్రాజు చీపురుపల్లి పంచాయతీ పరిధిలోని ఐదు ఎకరాల్లో డంపింగ్ యార్డ్ విస్తరించి ఉంది. ఈ యార్డులో శనివారం రాత్రి 8 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. రాజాం మునిసిపాలిటీకి చెందిన రెండు వాటర్ ట్యాంకర్లతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా , అదుపులోకి రాలేదు. రాత్రి పది గంటలు తర్వాత కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. డంపింగ్యార్డుకు సమీపంలో ఉన్న మామిడి, జీడి తోటలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సూరప్పమ్మ, పొన్నాడ బుజ్జి, చిట్టమ్మ, ఇప్పిలి లక్ష్మి తదితర బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, 2005లో రాజాం.. నగర పంచాయతీగా ఏర్పాటైంది. రాజాం పట్టణంలో డంపింగ్యార్డుకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో అప్పటి నగర పంచాయతీ ప్రత్యేకాధికారి, పాలకొండ ఆర్డీఓ పి.ఎం.జె.బాబు చొరవ తీసుకుని గార్రాజు చీపురుపల్లి ప్రజలు, నాయకులతో చర్చించారు. ఆ పంచాయతీ పరిధిలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. కానీ అధికారులు నేటి వరకూ డంపింగ్యార్డు చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా నివారించే చర్యలు చేపట్టలేదు. పట్టణం నుంచి సేకరించిన చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు. ఫలితంగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో చెత్తనిల్వలు పేరుకుపోయాయి. శనివారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో డంపింగ్ యార్డుతో పాటు చుట్టుపక్కల జీడి, మామిడి తోటలు కూడా కాలి బూడిదయ్యాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.