గృహ హక్కు పేరిట దోపిడీ

ABN , First Publish Date - 2021-10-30T03:47:45+05:30 IST

గృహ హక్కు పేరిట దోపిడీ

గృహ హక్కు పేరిట దోపిడీ
మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- పేదల ఇళ్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేయడమేంటి?

- మేము అధికారంలోకి వస్తే పట్టాలు ఉచితం

- టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు రవికుమార్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 29: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారని తెలిపారు. నాలుగు కేటగిరీల పేరుతో పేదల సొమ్మును దోచుకునేందుకు ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. ‘అసలు డీపట్టా భూమిని అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు. పేదవాడు తన రెక్కల కష్టంతో ఇల్లు నిర్మించుకుంటే దానికి జగన్‌ సర్కారు రిజిస్ట్రేషన్‌ చేయడమేంటి? ప్రజల ఆస్తులను జగన్మోహన్‌రెడ్డి తన తాత, తండ్రి ఆస్తులుగా భావించకూడదు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేసే హక్కు ఎవరిచ్చారు. గ్రామాల్లో వలంటీర్లు, పంచాయతీ సిబ్బందితో జగన్‌ రౌడీయిజం చేయిస్తున్నారు. ఎవరైనా అధికారులు వచ్చి నోటీసులు ఇస్తే ప్రజలు చించేయాలి. ఇళ్లు కొలతలు తీస్తామంటూ ఎవరైనా వస్తే అనుమతించవద్దు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఎటువంటి ఆంక్షలు లేకుండా లబ్ధిదారులందరికీ  ఉచితంగా పట్టాలు ఇస్తాం. గత ప్రభుత్వం జిరాయితీ భూములు కొని పేదలకు ఇచ్చింది. ఒకసారి పొజిషన్‌ పట్టా వచ్చాక దాన్ని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇప్పటికైనా ప్రజలను దోచుకునే పథకాలను విరమించుకోవాలి’ అని రవికుమార్‌ ప్రభుత్వానికి సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ  ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్‌,  తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు,  ఎం.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T03:47:45+05:30 IST