చంద్రబాబు ఇంటిపై దాడి హేయం
ABN , First Publish Date - 2021-09-18T05:38:53+05:30 IST
చంద్రబాబు ఇంటిపై దాడి హేయం
- వైసీపీ ఎమ్మెల్యే రమేష్పై కేసు నమోదు చేయాలి
- తెలుగుదేశం పార్టీ నాయకుల డిమాండ్
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 17: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రవికు మార్ అన్నారు. దీనికి కారణమైన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితులను, ప్రజల ఇబ్బందులపైనే తమ పార్టీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడారని చెప్పారు. చెత్తపై పన్ను వేసే వాళ్లను చెత్తపాలకుడు అనకుండా ఇంకేమంటారని ప్రశ్నిం చారు. చంద్రబాబును ఎన్నోసార్లు వైసీపీ నాయకులు తిట్టారని.. అప్పుడు ఆ వ్యాఖ్యలు వారికి భగవద్గీతలా ఉన్నాయా? అని ప్రశ్నిం చారు. వైసీపీ నాయకులు కర్రలు, సీసాలు, రాళ్లతో చంద్రబాబు ఇంటిపై దాడిచేసేందుకు వెళ్లడం దారుణమన్నారు. వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేదన్నారు. పోలీసులే ఆందోళనకారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సింతు సుధాకర్, పీఎంజే బాబు, ఎం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- రాజాం/కొత్తూరు: చంద్రబాబునా యుడు ఇంటిపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం వారు రాజాం, కొత్తూరులలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు వ్యవహరించిన వ్యక్తిపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరా వృతమైతే పరిస్థితులు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడం అమానుషమని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గురవాన నారాయణరావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- పాలకొండ: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం అమానుషమని అరకు పార్ల మెంట్ తెలుగు యువత అధ్యక్షుడు వారాడ సుమంత్నాయుడు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
- నరసన్నపేట: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ రౌడీలు దాడి చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఖండించారు. ఈ దాడికి డీజీపీ బాధ్యత వహించాలన్నారు.
- పలాస: చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడడం అమానుషమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్ రావు, మాజీ చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు.
- హరిపురం : చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో దాడికి దిగడం ఆటవిక చర్యని మందస మండల టీడీపీ అధ్యక్షుడు బావన దుర్యోధన, అధికార ప్రతినిధి దాసరి తాతారావు విమర్శించారు.
శ్రీకాకుళంలో మాట్లాడుతున్న రవికుమార్, లక్ష్మీదేవి