అర్హులందరికీ పథకాలు
ABN , First Publish Date - 2021-08-28T04:53:36+05:30 IST
అర్హులందరికీ పథకాలు
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
‘సిటిజన్ ఔట్ రీచ్’ ప్రారంభం
శ్రీకాకుళం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం కంపోస్టు కాలనీ వద్ద సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టణాల్లో ప్రతినెల నాలుగో శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను తెలియజేయాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పథకాలు తెలిపే క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, జేసీ శ్రీనివాసులు, అంధవరపు సూరిబాబు, ఎంవీ పద్మావతి, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ధర్మాన డుమ్మా....
కంపోస్టు కాలనీలో నిర్వహించిన సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం ప్రకటించినా.. ఎమ్మెల్యే ధర్మాన ముఖం చాటేశారు. తొలుత మంత్రి ధర్మాన కృష్ణదాస్తో పాటు ఎమ్మెల్యే ప్రసాదరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు ప్రచారం చేశారు. ఏమైందో కానీ స్థానిక ఎమ్మెల్యే లేకుండానే సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు.