రాజాంలో ఏసీబీ కలకలం

ABN , First Publish Date - 2021-07-13T05:06:23+05:30 IST

రాజాం ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మణరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వ్యవసాయ మోటారుకు విద్యుత్‌ లైన్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు ఓ రైతు వద్ద నుంచి రూ.1.10 లక్షలు ఏఈ డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేని బాధిత రైతు వేడుకున్నా వినలేదు.

రాజాంలో ఏసీబీ కలకలం
ఏసీబీ అధికారులకు పట్టుబడిన ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మణరావు (వృత్తంలో ఉన్న వ్యక్తి)


లంచం తీసుకుంటూ పట్టుబడిన విద్యుత్‌ శాఖ ఏఈ

వ్యవసాయ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుకు రూ.1.10 లక్షలు డిమాండ్‌

అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించిన బాధితుడు

రాజాం/రూరల్‌, జూలై 12: రాజాం ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మణరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వ్యవసాయ మోటారుకు విద్యుత్‌ లైన్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు ఓ రైతు వద్ద నుంచి రూ.1.10 లక్షలు ఏఈ డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేని బాధిత రైతు వేడుకున్నా వినలేదు. కార్యాలయానికి కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదు. దీంతో విసిగి వేశారిన బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏఈకి లంచం ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజాం నగర పంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన టంకాల దిలీప్‌ అనే రైతు తన పొలంలో మోటారు వేసుకున్నాడు. దానికి విద్యుత్‌ లైన్‌తో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు విద్యుత్‌ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మణరావు రూ.1.10 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని బాధిత రైతు దిలీప్‌ విన్నవించినా ఏఈ పట్టించుకోలేదు. లంచం ఇవ్వనిదే పని జరగదని తేల్చి చెప్పాడు. చివరకు రూ.90 వేలకు వారి మధ్య బేరం కుదిరింది. ముందుగా రూ.80 వేలు, ఇచ్చేందుకు దిలీప్‌ అంగీకరించాడు. కానీ ఏఈ తీరుపై విసిగి వేశారిన బాధిత రైతు దిలీప్‌ శ్రీకాకుళంలోని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తిని ఆశ్రయించాడు. తనకున్న 2.20 ఎకరాల భూమిలో బోరు వేసుకున్నానని... విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే ఏఈ లంచం డిమాండ్‌ చేశారని.. తెలిపాడు. కార్యాలయానికి పలుమార్లు తిరిగినా.. పట్టించుకోవడం లేదని వాపోయాడు. దీంతో ఏసీబీ అధికారులు ఇచ్చిన సలహా మేరకు రాజాంలోని కార్యాలయం వద్ద ఏఈ లక్ష్మణరావుకు దిలీప్‌ రూ.80 వేలు అందజేశాడు. అదే సమయంలో ఏసీబీ డీఎస్పీ సిబ్బందితో కలిసి రెడ్‌ హ్యాండెడ్‌గా ఏఈను పట్టుకున్నారు. ఏఈ లక్ష్మణరావుపై కేసు నమోదుచేశామని..మంగళవారం విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని ఆయన కోరారు. ఈ ఘటనతో విద్యుత్‌ శాఖలో అలజడి నెలకొంది. 






Updated Date - 2021-07-13T05:06:23+05:30 IST