తెల్ల రంగుపడింది..!
ABN , First Publish Date - 2021-02-02T04:32:14+05:30 IST
ఎన్నికల కోడ్ ఫలితంగా మండలంలోని సచివాలయాలకు ఎట్టకేలకు తెల్లరంగు పడుతోంది. నిన్నమొన్నటి వరకు కోర్టు చెప్పినా మండలంలోని సచివాలయ భవనాలకు వేసిన పార్టీ రంగులను అధికారులు తొలగించలేదు. ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలవుతుండటంతో అధికారులు తమ విధులకు పదునుపెట్టారు.

కొండపి, ఫిబ్రవరి 1 : ఎన్నికల కోడ్ ఫలితంగా మండలంలోని సచివాలయాలకు ఎట్టకేలకు తెల్లరంగు పడుతోంది. నిన్నమొన్నటి వరకు కోర్టు చెప్పినా మండలంలోని సచివాలయ భవనాలకు వేసిన పార్టీ రంగులను అధికారులు తొలగించలేదు. ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలవుతుండటంతో అధికారులు తమ విధులకు పదునుపెట్టారు. గ్రామాల్లో వివిధ ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులు, అదేవిఽధంగా విద్యుత్ స్తంభాలకు వేసిన అధికార పార్టీ రంగులపై తెల్లరంగు వేస్తున్నారు. మూగచింతల గ్రామ సచివాలయంలో 10వ వార్డు పోలింగ్ కేంద్రం ఉంది. ఈ సచివాలయానికి అధికార పార్టీ రంగు ఉంది. దీనిపై ఇటీవల గ్రామంలో పోలీసులు నిర్వహించిన సమావేశంలోని ప్రతిపక్ష పార్టీవారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయం తమ పరిధిలో లేదని, ఇన్చార్జి ఎంపీడీవో నోటీసుకు తెస్తామని పోలీసులు తెలిపారు. ఆ విధంగా చేశారు. తాజాగా సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఉన్న పార్టీ రంగుపై తెల్ల రంగు వేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పదో వార్డు పోలింగ్ కేంద్రం ఉంది. పంచాయతీ కార్యాలయం ఒకటో వార్డు పరిధిలో ఉంది. ప్రతిపక్ష పార్టీవారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒకటోవార్డు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, పదో వార్డుకు పోలింగ్ కేంద్రంగా గ్రామ పంచాయతీ భవనాన్ని భవనాన్ని ఏర్పాటు చేయడంపై కూడా అభ్యంతరం పెట్టారు. అదేవిధంగా పెదకండ్లగుంట గ్రామంలోని జనరల్ స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను జడ్పీ హైస్కూల్ భవనంలోకి మార్చాలన్న అధికారుల ప్రతిపాదనలకూ ఆ గ్రామ ఎస్సీలు సోమవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీకి సమీపంలో ఉన్న కేంద్రాలను జడ్పీ స్కూల్కు మార్చవద్దని అధికారులకు ఎస్సీలు విజ్ఞప్తి చేశారు.