కంకణాలపల్లిలో వసతులు కరువు
ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST
మండలంలోని కంకణాలపల్లి గ్రామం అభివృద్ధికి అందనంత దూరంలో ఉంది. కనీస వసతులు లేక ప్రజలు అవస్థలు పడు తున్నారు.
అభివృద్ధిని పట్టించుకోని పాలకులు
తాగునీటికీ తప్పని పాట్లు
అవస్థలు పడుతున్న ప్రజలు
త్రిపురాంతకం, ఏప్రిల్ 20 : మండలంలోని కంకణాలపల్లి గ్రామం అభివృద్ధికి అందనంత దూరంలో ఉంది. కనీస వసతులు లేక ప్రజలు అవస్థలు పడు తున్నారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా, గ్రామానికి నేటికీ సౌకర్యాలు కల్పించడంలో పాలకులు, అధికారులు దృష్టి సారించడంలేదని గ్రా మస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 500 ఇళ్లు, 2500 మందికిపైగాజనాబా ఉన్నారు. మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీల కుటుంబాలే. నేటికీ గ్రామంలో 50కి పైగా పూరిళ్లు కనిపిస్తాయి. గ్రామంలో 12 వీధులుండగా కేవలం ప్రధానవీధికి మాత్రమే కొంతమేర సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు. ఏఒక్కచోటా కాలువలు నిర్మించక పోవడంతో చిన్నపాటి వర్షానికి వీధంతా బురదమయంగా మారుతుంది. ఎండాకాలం వచ్చిందంటే దుమ్ము రేగుతోంది. దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. తాగునీరు అందించేందుకు ఓవర్హెడ్ ట్యాంకును నిర్మించారు. నీరు సరఫరా కాకపోవడంతో ఆట్యాంకు ప్రస్తుతం దిష్టిబొమ్మలా మారింది. గ్రామంలో ఒక డీప్బోరు ఉండగా అదీ అంతంత మాత్రంగానే పని చేస్తోంది. మురికి నీటి మధ్యనే ఉన్న మోటారు వద్దే నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి ఉందని చెప్తున్నారు. ఎనిమిది చేతిపంపులు ఉండగా అవీ నిరుపయోగంగా మారాయి. గ్రామంలో రెండు ఎస్సీ కాలనీలు ఉండగా, ఒక కాలనీకి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల నుండి రూ.40 లక్షలతో నాలుగు సీసీ రోడ్లను నిర్మించారు. మరో కాలనీలో రోడ్లన్నీ మురికినీటి చెరువుల్లా కనిిపిస్థాయి. గ్రామానికి వెళ్లాలన్నా, రావాలన్నా రవాణా సౌకర్యం లేదు. కేవలం ఆటోలే శరణ్యం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామం నేటికీ అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, సబ్ప్లాన్ నిధులు మంజూరు చేసి గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లను నిర్మించాలని, పక్కా ఇల్లు మంజూరు చేయాలని, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.