దళితులపై జగన్ దమనకాండ ఆపాలి
ABN , First Publish Date - 2021-08-11T04:57:04+05:30 IST
దళితులపై జరుగుతున్న దాడులను వైసీపీ పాలకులు ఆపాలని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు డిమాండ్ చేశారు.
![దళితులపై జగన్ దమనకాండ ఆపాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921081011254759/08102021232614n95.gif)
గొంతునొక్కితే అందలం ఎక్కించిన వారే ప్రతిఘటిస్తారని హెచ్చరిక
నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్బాబు
ఎర్రగొండపాలెం, ఆగస్టు 10 : దళితులపై జరుగుతున్న దాడులను వైసీపీ పాలకులు ఆపాలని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు డిమాండ్ చేశారు. వై.పాలెం మండలం కొలుకుల గ్రామంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎస్సీ సెల్ పిలుపు మేరకు దళిత నాయకులు విజయవాడలో చేపట్టిన ప్రతిఘటన ర్యాలీని పోలీసులు అడ్డుకొని నిర్బంధం చేయడాన్ని తప్పుబట్టారు. దళితుల ఓట్లతో అందలమెక్కిన జగన్ వారిని ఉక్కుపాదంతో తొక్కుతున్నారన్నారు. అమరావతి కోసం ఉద్యమిస్తున్న దళిత మహిళలపై కేసులు పెట్టారని చెప్పారు. దళితులపై రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు జరిగాయని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఎరిక్షన్బాబు హెచ్చరించారు. తొలుత ఆయన నరసాయపాలెం, వెంకటాద్రిపాలెం, గంజివారిపల్లె, మొగుళ్లపల్లి, కాశికుంటతాండా పంచాయతీలలో టీడీపీ గ్రామ కమిటీలను నియమించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు షేక్ జిలానీ, లింగయ్య, తెలుగుయువత నాయకులు మల్లికార్జుననాయుడు, వేగినాటి శ్రీనివాస్, తోట మహెష్, రైతు సంఘం అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, బోయలపల్లి టీడీపీ గ్రామ నాయకులు పాలడుగు వెంకటకోటయ్య, కాశికుంటతాండా సర్పంచి చిన్న మంత్రునాయక్, కొలుకుల సర్పంచి వేల్పుల రాజయ్య, నాయకులు పాల్గొన్నారు.