జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు నిరసనలు
ABN , First Publish Date - 2021-11-23T05:35:37+05:30 IST
గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్రప్రభుత్వం దారిమళ్లించడంతో సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో సర్పంచ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయడంతో గ్రామాల్లో ప్రస్తుత వర్షాల పరిస్థితుల్లో పలు పనులు చేపట్టేందుకు సర్పంచ్లు శ్రీకారం చుట్టారు. అయితే రెండు రోజులక్రితం రాత్రికిరాత్రే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను దారిమళ్లించడంతో పంచాయతీ అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నది.
![జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు నిరసనలు](https://media.andhrajyothy.com/appimg/galleries/192111231202499/11232021000326n5.jpg)
కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ సర్పంచ్ల వెనుకడుగు
ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని సంఘం పిలుపు
ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు 22 : గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్రప్రభుత్వం దారిమళ్లించడంతో సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో సర్పంచ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయడంతో గ్రామాల్లో ప్రస్తుత వర్షాల పరిస్థితుల్లో పలు పనులు చేపట్టేందుకు సర్పంచ్లు శ్రీకారం చుట్టారు. అయితే రెండు రోజులక్రితం రాత్రికిరాత్రే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను దారిమళ్లించడంతో పంచాయతీ అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నది. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 60 కోట్ల వరకు నిధులను దారిమళ్ళించారు. దీంతో సర్పంచ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా కొన్ని మండలాల్లో ఎమ్మెల్యేల ఒత్తిడితో సర్పంచ్లు ఆందోళనలు విరమించుకున్నట్లు సమాచారం. దీంతో సర్పంచ్లసంఘం నేతలు మంగళవారం ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.
నిధులు దారి మళ్లించటం తగదు
మద్దిపాడు : గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించడం తగదని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి. వీరభద్రాచారి అన్నారు. సోమవారం మద్దిపాడు సర్పంచుల సంఘం అధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బెజవాడ శ్రీరామమూర్తి, మండల అధ్యక్షుడు నారా సుబ్బారెడ్డి , కాకర్ల విజయకుమార్ తదితరులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసేందుకే నిధులు మళ్లింపు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు సర్పంచు మద్దిరాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.