రిక‘వర్రీ’
ABN , First Publish Date - 2021-12-26T05:42:34+05:30 IST
ఎస్సీ కార్పొరేషన్లో రుణ బకాయిలు పేరుకుపోయాయి. లబ్ధిదారుల నుంచి వీటిని వసూలు చేయడానికి అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. కార్పొరేషన్లో సరిపడా సిబ్బంది లేకపోవడం కూడా సమస్యగా మారింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి యూనిట్ల పంపిణీ నిలిచిపోయింది. గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన అరకొర యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నారే తప్ప కొత్త వాటిని మంజూరు చేయటం లేదు. అదేసమయంలో పాత బకాయిలు వసూలు చేయాలని అధికారులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆవైపు దృష్టి సారించిన వారు లబ్ధిదారులు సహకరించకపోవడంతో వాటిని రాబట్టలేక తలలు పట్టుకుంటున్నారు.

ఎస్సీ కార్పొరేషన్లో పేరుకుపోతున్న
రుణ బకాయిలు
సహకరించిన లబ్ధిదారులు
సిబ్బంది కొరతతో సమస్య
రాష్ట్రంలోనే చివరి స్థానంలో జిల్లా
ప్రభుత్వం నుంచి పెరిగిన ఒత్తిడి
తలలుపట్టుకుంటున్న అధికారులు
ఒంగోలు నగరం, డిసెంబరు 25 : ఎస్సీ కార్పొరేషన్లో రుణ బకాయిలు పేరుకుపోయాయి. లబ్ధిదారుల నుంచి వీటిని వసూలు చేయడానికి అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. కార్పొరేషన్లో సరిపడా సిబ్బంది లేకపోవడం కూడా సమస్యగా మారింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి యూనిట్ల పంపిణీ నిలిచిపోయింది. గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన అరకొర యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నారే తప్ప కొత్త వాటిని మంజూరు చేయటం లేదు. అదేసమయంలో పాత బకాయిలు వసూలు చేయాలని అధికారులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆవైపు దృష్టి సారించిన వారు లబ్ధిదారులు సహకరించకపోవడంతో వాటిని రాబట్టలేక తలలు పట్టుకుంటున్నారు.
టీడీపీ హయాంలో ఇచ్చిన రుణాల వసూలుపై దృష్టి
మూడేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన యూనిట్లను పొందిన లబ్ధిదారుల నుంచి రుణాల రికవరీపై ప్రస్తుతం అధికారులు దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పట్లో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల కింద యూనిట్లు మంజూరు చేశారు. వీటికి సంబంధించి దాదాపు రూ.13 కోట్లు బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. ఇక అప్పటి ప్రభుత్వం కూడా విరివిగా రుణాలు ఇచ్చింది. ఆ బకాయిలు కూడా భారీగానే పేరుకుపోయాయి. రుణాల రికవరీలో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉండటంతో కార్పొరేషన్ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో వారు రికవరీపై దృష్టి సారించారు.
హామీ ఇచ్చిన వారిపై ఒత్తిడి
ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రుణాలు తీసుకున్న లబ్ధిదారుల ఫోన్ నంబర్లతో ప్రత్యేక వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. రుణాలను తిరిగి చెల్లించాలంటూ ఆ గ్రూపు ద్వారా కోరుతున్నారు. కొంత మంది లబ్ధిదారులు ఎంతకీ స్పందించకపోవటంతో రుణాలు పొందే సమయంలో వారికి హామీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారు. మీరు ష్యూరిటీ పెట్టిన లబ్ధిదారులు తిరిగి రుణాలు చెల్లించడం లేదని, వెంటనే వారి ద్వారా వాయిదాలను కట్టించాలని సమాచారం పంపిస్తున్నారు. రెండు నెలల క్రితం రుణాల రికవరీకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఎక్కువ మొత్తంలోనే బాకాయిలను వసూలు చేశారు. అయినా రికవరీలో జిల్లా చివరి స్థానంలో ఉండటంతో మళ్లీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఎక్కువ మొత్తంలో వసూలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.