కేజీబీవీ మెరిట్ జాబితాలు సిద్ధం
ABN , First Publish Date - 2021-12-15T06:28:59+05:30 IST
జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాలు సిద్ధమయ్యాయి.

ఒంగోలువిద్య, డిసెంబరు 14 : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాలు సిద్ధమయ్యాయి. మొత్తం 145 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా 1,583 దరఖాస్తులు వచ్చాయి. పీజీటీ జనరల్ ఫౌండేషన్ కోర్సు రెండు పోస్టులు ప్రకటించగా ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదు. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అధికారులు మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. వీటిని బుధవారం ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తామని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. కాగా కేజీబీవీ అదనపు జాయింట్ సెక్రటరీ వి.మేరీచంద్రిక మంగళవారం ఒంగోలు వచ్చి మెరిట్ జాబితాలను పరిశీలించారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో భర్తీ చేస్తున్నందున జాబితాలను కూడా అలాగే ప్రకటించాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని కోరారు.