‘పీఎంజీఎస్’ టెండర్ల ప్రక్రియ పూర్తి
ABN , First Publish Date - 2021-05-02T06:19:54+05:30 IST
ప్రధాన మంత్రి గ్రామసడక్ యోజన (పీఎంజీఎస్) కింద జిల్లాకు మంజూరైన కొత్త రోడ్ల టెండర్ల ప్రక్రియ ముగించుకుని త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.
![‘పీఎంజీఎస్’ టెండర్ల ప్రక్రియ పూర్తి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జిల్లావ్యాప్తంగా పట్టాలెక్కనున్న 17 రోడ్ల పనులు
సీఈ ఆఫీస్ ఆమోదమే తరువాయి
ఒంగోలు (జడ్పీ), మే 1: ప్రధాన మంత్రి గ్రామసడక్ యోజన (పీఎంజీఎస్) కింద జిల్లాకు మంజూరైన కొత్త రోడ్ల టెండర్ల ప్రక్రియ ముగించుకుని త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. టెండర్లకు సంబంధించి అన్ని ప్రక్రియలతోపాటు రివర్స్ టెండరింగ్ కూడా పూర్తయింది. రాష్ట్రస్థాయిలో సీఈ కార్యాలయం ఆమోదం తదుపరి కమిషనర్ ఆఫ్ టెండర్స్ అంగీకారంతో టెండర్లు పొందిన వారి జాబితా జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి రానుంది. ఆయా కాంట్రాక్టర్లతో వర్క్ అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత పనులు మొదలు కానున్నాయి.
జిల్లావ్యాప్తంగా 17 పనులు
2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను పీఎంజీఎస్ పథకం కింద కేంద్రం జిల్లాకు రూ.90కోట్లు మంజూరయ్యాయి. ఈ మొత్తంలో కేంద్రం వాటా రూ.54కోట్లు కాగా, రాష్ట్రం వాటా రూ.36కోట్లుగా ఉంది. ఈ నిధులతో జిల్లాలో 153.21 కిలోమీటర్ల పరిధిలో 17 పనులను చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం వీటికి టెండర్ల ప్రక్రియ ముగిసింది.
జిల్లాలో వేయనున్న రోడ్లు
గుడ్లూరు నుంచి పురేటిపల్లి, రాణిగవరం నుంచి పంగులూరు, కొనకనమిట్ల నుంచి నాగంవల్లి, కురిచేడు నుంచి గంగదేవిపల్లి, పూరిమెట్ల నుంచి నూజెళ్లపల్లి, అమ్మనబ్రోలు నుంచి పమిడిపాడు, కరవది నుంచి ఉలిచి రోడ్లు ప్రధానంగా ఉన్నాయి. కొత్తగా వేయనున్న రోడ్లతో పాటు జిల్లావ్యాప్తంగా అస్తవ్యస్తంగా తయారైన రహదారులకు మరమ్మతులపై కూడా యంత్రాంగం దృష్టిపెట్టాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు