ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-05-02T07:19:36+05:30 IST
కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యం విడనాడి అప్రమత్తంగా ఉండాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు.
![ప్రజలు అప్రమత్తంగా ఉండాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921050201474387/05022021014829n6.jpg)
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
దర్శి, మే 1 : కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యం విడనాడి అప్రమత్తంగా ఉండాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అధికారులతో ఆయన సమీక్షా, సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు కన్పించగానే నిర్లక్ష్య వైఖరి అవలంభించకుండా సరైన వైద్యం తీసుకోవాలన్నారు. వలంటీర్లను అప్రమత్తం చేసి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్య వైఖరి అవలంభించిన అధికారులు, సిబ్బందిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొంతమంది ప్రైవేట్ ఆర్ఎంపీలు కరోనా వైద్యం చేస్తూ కేసులు బయటపడకుండా దాచి పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రికి వచ్చినా చికిత్స కష్టమోతోందన్నారు. దర్శితో పాటు కురిచేడు, దొనకొండ, తాళ్లూరు, ముండ్లమూరు వంటి జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో 144 సెక్షన్ విధించి ప్రజలు గుంపులుగా చేరకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక కస్తూరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఈవో, కొవిడ్ ప్రత్యేకాధికారి సుబ్బారావు, దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు, మండల ప్రత్యేకాధికారి కె.అర్జున్నాయక్, తహసీల్దార్ వీడీబీ వరకుమార్, ఎంపీడీవో జి.శోభన్బాబు, దర్శి సీఐ భీమానాయక్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఆనంద్బాబు, నగర పంచాయతీ కమిషనర్ ఆవుల సుధాకర్, ఏఎంసీ చైర్మెన్ ఐ.వేణుగోపాల్రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పామూరు : కరోనా వైరస్ సోకిన వారందరూ విధిగా హోమ్ ఐసోలేషన్లో ఉండి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని తహసీల్దార్ సీహెచ్.ఉష సూచించారు. మండలంలోని నిమ్మచెట్లపల్లి గ్రామంలో కరోనా బాధిత కుటుంబాలను శనివారం ఆమె సందర్శించారు. కరోనా బారిన పడిన వారు 21 రోజులు బయటకు రావద్దని, బయట తిరిగితే వైరస్ మరింతగా విజృంభిస్తుందని, నిభందనలు పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వగ్గంపల్లి గ్రామంలో కరోనా వైరస్పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆమె వెంట సర్పంచ్ దేవనబోయిన సుబ్బయ్య, లెక్కల అనిత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.